నిధులు లేక అభివృద్ధి చేయలేకపోతున్నాం
ABN , First Publish Date - 2022-09-08T05:46:39+05:30 IST
నిధులు లేక అభివృద్ధి చేయలేకపోతున్నాం
- జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి
ధారూరు, సెప్టెంబరు 7: ప్రభుత్వం జిల్లాకు కేటాయిస్తున్న నిధులతో గ్రామాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేయలేక పోతున్నామని జిల్లా పరిషత్తు చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి తెలిపారు. ధారూరులో బుధవారం నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లా పరిషత్తుకు మంజూరవుతున్న నిధులు ఏ మూలకూ సరిపోవటం లేదని, అభివృద్ధి విషయంలో తాను సంతృప్తిగా లేనని అన్నారు. ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయిస్తేనే గ్రామాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. సర్పంచులు పన్నులు వసూలుచేసి పంచాయతీల ఆదాయం పెంచుకోవాలని సూచించారు. పాఠశాలల సమస్యలను తన దృష్టికి తీసుకు రావాలపి అన్నారు. గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను బోధించి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయలను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్ చంద్రమౌళి, వాలీబాల్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు జె. హన్మంత్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బసప్ప, ఎంపీటీసీ శ్వేతారెడ్డి, యువజన నాయకుడు వడ్ల నందు, మండల విద్యాధికారి బాబుసింగ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.