ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోవాలి
ABN , First Publish Date - 2022-07-05T05:30:00+05:30 IST
ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోవాలి
ఘట్కేసర్/మేడ్చల్, జూలై 5 : ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని పోచారం మున్సిపల్ కమిషనర్ సురేష్ అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని యంనంపేట్, నారపల్లి, అన్నోజిగూడలో గల పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న దుకాణదారులకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా పెరగడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని గుర్తుచేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ నివారణకు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నర్సింహారెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం మున్సిపాలిటీలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టి, ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 120 కంటే తక్కువ మైక్రాన్లు ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడటం నిషేధమని దుకాణ యజమానులకు సూచించారు. చట్ట వ్యతిరేకంగా ప్లాస్టిక్ కవర్లను అమ్మినా, వాడినా.. జరిమానా విధించడంతోపాటు చట్టపరమైన శిక్షలు ఉంటాయన్నారు. ప్రజలు మార్కెట్లకు వెళ్లేటప్పుడు జౌళి సంచులను తీసుకువెళ్లాలని, ఇళ్లల్లో సింగల్ యూజ్ ప్లాస్టిక్ను వాడరాదని సూచించారు. ప్లాస్టిక్ వాడటం పర్యావరణానికి పెను ప్రమాదన్నారు. కార్యక్రమంలో కమిషనర్ షఫీవుల్లా, మాజీ ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి, పానుగంటి రవీందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాంచందర్ తదితరులున్నారు.