చేపల వలలో కట్టి.. సాగర్‌ మధ్యలో జారవిడిచి..

ABN , First Publish Date - 2022-09-10T06:02:13+05:30 IST

చేపల వలలో కట్టి.. సాగర్‌ మధ్యలో జారవిడిచి..

చేపల వలలో కట్టి.. సాగర్‌ మధ్యలో జారవిడిచి..

రాయదుర్గం, సెప్టెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి):  బావ మోజులో పడి అతని సహకారంతో తన భర్తనే అడ్డు తొలిగించుకుందీ ఓ ఇల్లాలు. నిద్రమాత్రలతో అపస్మారక స్థితికి చేర్చి చేపల వలలో అతన్ని కట్టి నాగార్జునసాగర్‌ నీటి మధ్యలో జారవిడిచి హత్యచేశారు. ఈ దారుణ హత్య కేసులో నిందితులను, వారికి సహకరించిన మరో ముగ్గురిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ తిరుపతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

ఇబ్రహీంపట్నం నివాసి సభావత్‌ లక్పతి 2012లో ధనావత్‌ సరోజను ప్రేమ వివాహం చేసుకున్నారు. నగరంలోని పుప్పాలగూడ ఎక్నాపూర్‌కు వచ్చి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. కొన్నేళ్ల తర్వాత అతని భార్య సోదరి ధనావత్‌ రోజా కుటుంబం కూడా మణికొండకు వలస వచ్చింది. రోజా భర్త రాగ్యానాయక్‌(28) క్యాబ్‌డ్రైవర్‌. మద్యం మత్తులో ఆమెను తరచూ వేధించేవాడు. ఈ క్రమంలో రోజా బాగోగులు చూస్తున్న లక్పతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన రాగ్యానాయక్‌ భార్యపై వేధింపులను అధికం చేశాడు. దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డు తగులు తున్నాడని, అతని అడ్డుతొలగించాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో మే 23న గుడిపండగ సందర్భంగా మిర్యాలగూడ పరిధి లావుడి తండాకు వెళ్లిన లక్పతి, రాగ్యానాయక్‌ల మధ్య గొడవ జరిగింది.  దీంతో రాగ్యానాయక్‌ను చంపేందుకు లక్పతి తన వద్ద పనిచేస్తున్న శివనాగేశ్వరరావు సహకారం తీసుకుని సమయం కోసం వేచి చూశాడు. ఇటీవల ర్యాగానాయక్‌ వద్ద కొన్న భూమి తాలూకు డబ్బు ఇస్తానని గతనెల 19న అతన్ని పిలిపించాడు. అతన్ని  కారులో ఎక్కించుకుని కొద్దిదూరం ప్రయాణించాక తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న నిద్రమాత్రలు కలిపిన బాదంపాలు తాగమని అతనికిచ్చాడు. అతను అపస్మారక స్థితికి చేరగానే కారులో నాగార్జునసాగర్‌కు తరలించారు. పథకం ప్రకారం మరికొందరు లక్పతికి సహకరించి రాగ్యానాయక్‌ను కాశిరాజ్‌పల్లి పుష్కరఘాట్‌ వద్ద బోట్‌లోకి తరలించి సాగర్‌లో ఎక్కువ లోతున్న ప్రాంతానికి చేరుకున్నారు. 

చేపల వలలో వేసి.. సాగర్‌లో విడిచి హత్య 

రాగ్యానాయక్‌ను చేపల వలలో వేసి ఒక బండరాయిని కట్టి నీటిలో పడేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఆగస్టు 24న తన భర్త కనిపించడం లేదంటూ రోజాతో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాగ్యానాయక్‌ ఎక్కడెక్కడకు వెళ్లాడని ఇంటి పరిసరాల ప్రాంతాల్లోని సీసీఫుటేజ్‌ను, కాల్‌డేటాను పరిశీలించారు. లక్పతితో కలిసినట్లు సీసీ ఆధారాలు లభించాయి. రోజా పదేపదే లక్పతికి ఫోన్‌ చేసినట్లు కాల్‌డేటాలో తేలడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో నిందితులు హత్యచేసిన క్రమాన్ని పోలీసులకు వివరించారు. హత్యకు సహకరించిన వారికి రూ.2.20లక్షలు చెల్లించినట్లు తెలిపారు. లక్పతి, రోజాతోపాటు  వారికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-09-10T06:02:13+05:30 IST