ఓడీఎఫ్ కింద 121 గ్రామాల ఎంపిక
ABN , First Publish Date - 2022-10-02T05:44:11+05:30 IST
ఓడీఎఫ్ కింద 121 గ్రామాల ఎంపిక
- జడ్పీ సీఈవో జానకిరెడ్డి
వికారాబాద్, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్వచ్ఛతాహి సేవ కింద జిల్లాలో ఓడీఎఫ్ కింద 121 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారని జడ్పీ సీఈవో జానకిరెడ్డి తెలిపారు.శనివారం డీఆర్డీవో కృష్ణన్, జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డిలతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులతో మాట్లాడారు. ఇప్పటికే ఎంపికైన 121 ఓడీఎఫ్ గ్రామ పంచాయతీల్లో మిగిలిన చిన్నపాటి పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఓడీఎఫ్ గ్రామాల్లో ప్రతిరోజూ తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి తడి చెత్తతో తయారు చేసిన ఎరువును హరితహారం మొక్కలకు వేయాలని, లేదా విక్రయించాలని చెప్పారు. ప్లాస్టిక్, ఇనుము, రాగి, గాజు వంటి వస్తువులను విక్రయించగా, వచ్చేఆదాయంతో గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావచ్చన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. కాలువల ద్వారా వచ్చే వర్థ్యాలు పంట పొలాలు, చెరువుల్లోకి వెళ్లకుండా కాలువల చివరన ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. ఎక్కడ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలన్నారు. నేడు గాంధీ జయంతి పురస్కరించుకుని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామ సభల్లో ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి వీడియోలు, ఫోటోలు డీఆర్డీవో కార్యాలయానికి పంపించాలని సూచించారు.