పర్యావరణ పరిరక్షణలో మహిళా జర్నలిస్టుల పాత్ర కీలకం
ABN , First Publish Date - 2022-09-12T05:19:56+05:30 IST
పర్యావరణ పరిరక్షణలో మహిళా జర్నలిస్టుల పాత్ర కీలకం
కడ్తాల్, సెప్టెంబరు 11: పర్యావరణ పరిరక్షణ, ప్రజాచైతన్య కార్యక్రమాల్లో మహిళా జర్నలిస్టులు భాగస్వాములు కావాలని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్పర్సన్ లీలాలక్ష్మారెడ్డి పిలుపు నిచ్చారు. కాలుష్య రహిత సమాజ స్థాపనకు కృషిచేయాలని కోరారు. అన్మా్సపల్లిలోని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఎర్త్సెంటర్లో ఆదివారం పర్యావరణ పరిరక్షణపై మహిళా జర్నలిస్టులతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు చెందిన సుమారు 30మంది మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు. సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. లీలాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణపైనే భావితరాల మనుగడ ఆధారపడి ఉందన్నారు. సీజీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 50లక్షలకుపైగా మొక్కలు నాటామని, రక్షాబంధన్లా వృక్షబంధన్ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లలకు మొక్కలు నాటడం, పెంచడం నేర్పించామన్నారు. ప్రజా శ్రేయస్సుకు సీజీఆర్ చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి మహిళా జర్నలిస్టులు తోడ్పాటునందించాలని కోరారు. కార్యక్రమంలో ఎర్త్సెంటర్ డైరెక్టర్ వసంతలక్ష్మి, జర్నలిస్టు గాయత్రి, ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, కె.పురుషోత్తమ్రెడ్డి, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు.