పేదల భూములను లాక్కున్నారు
ABN , First Publish Date - 2022-03-17T05:25:14+05:30 IST
పేదల భూములను లాక్కున్నారు
- రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ చైర్పర్సన్ మీనాక్షీ నటరాజన్
మేడ్చల్ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి), మార్చి 16: శామీర్పేటలో పేదల వద్ద నుంచి 35ఎకరాలు అసైన్డ్ భూములు లాక్కొన్నారని, పేదల నుంచి తీసుకున్న భూముల్లో కలెక్టరేట్ కట్టడం అవసరమా..? అని రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ ఛైర్ పర్సన్ మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం అలోచించకపోవడం వల్ల నేడు రైతులకు ఉపాధి లేక, వ్యవసాయ భూమి కోల్పాయారన్నారు. బుధవారం కీసర మండలం తిమ్మాయిపల్లి, అంతాయిపల్లి, శామీర్పేట మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వహించారు. శామీర్పేట దళిత కాలనీలో దళిత మహిళలతో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ కాలంలో పేదలకు శామీర్పేటలో 250 ఎకరాల భూమిని దళితులకు ఇస్తే దానిని ప్రభుత్వం తీసుకొని నల్సార్ యూనివర్సిటీని నిర్మించిందన్నారు. బాధితులకు వేరేచోట భూమి ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు పేదల భూములను లాక్కుంటున్నారని, వారి భూముల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ పోరాటంలో అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆక్రమణకు గురైన భూములను తిరిగి పొందేందుకు దళితులు, రైతు వర్గాలు కలిసికట్టుగా పోరాడాలని మీనాక్షీ నటరాజన్ అన్నారు. పాదయాత్రలో డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, కోర్డ్డినేటర్లు వజ్రే్షయాదవ్, హరివర్ధన్రెడ్డి, అయోధ్యరెడ్డి, శంకర్గౌడ్, భూపాల్, నర్సింగ్ యాదవ్, అశోక్, సర్పంచ్ శిల్ప, శ్రీనివాస్ పాల్గొన్నారు.