‘ధరణి’తో అధికార పార్టీ నేతలకే ప్రయోజనం
ABN , First Publish Date - 2022-10-12T05:06:43+05:30 IST
ధరణి వెబ్సైట్ కేవలం అధికార పార్టీ నాయకులు,
యాచారం, అక్టోబరు 11 : ధరణి వెబ్సైట్ కేవలం అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల భూములను రక్షించడానికే ఉందని, ఇందులో పేదల భూములను అప్డేట్ చేయడం లేదని, దీంతో వారంతా రైతుబంధు, రైతుబీమా, కేంద్రం ఇచ్చే సాయం అందడంలేదని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బి.మధుసూదన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టబుల్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం యాచారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. ధరణి వెబ్సైట్లో పేదలకు చెందిన ఎకరం, రెండెకరాల భూములు కొన్నట్లు రికార్డులున్నా వారికి ధరణి పట్టాపా్సపుస్తకం అందడంలేదన్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్తోపాటు ఇతర అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని దేవాలయ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారన్నారు. పేదలను ఆదుకుంటామని గొప్పలు చెబుతున్న స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి.. వారి గోడు పట్టించుకోవడంలేదని మండ్డిపడ్డారు. నందివనపర్తి, కుర్మిద్ద, నజ్దిక్సింగారం, తాడిపర్తి గ్రామాల్లో వందలాది మంది పేదలకు 37ఇ,38ఇ సర్టిఫికెట్లున్నా వారికి పట్టా పాస్పుస్తకాలివ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దారు సుచరితకు సమర్పించారు, కార్యక్రమంలో ధర్మన్నగూడ సర్పంచ్ బాషయ్య, కొత్తపల్లి ఉపసర్పంచ్ కె.జగన్, సీపీఎం నాయకులు ఆంజనేయులు, అంజయ్య, థావ్నాయక్, జంగయ్య తదితరులున్నారు.