ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలి
ABN , First Publish Date - 2022-01-24T05:10:56+05:30 IST
ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలి
- తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్య సంఘం తీర్మానం
వికారాబాద్, జనవరి 23 : రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్య సంఘం (టీపీజేఎంఏ) ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. ఆదివారం జరిగిన టీపీజేఎంఏ రాష్ట్ర కార్యవర్గ వర్చువల్(జూమ్) సమావేశంలో ఇంటర్మీడియట్ విద్య చాలా కీలకమని, దీనిలో ప్రమాణాలు పడిపోతే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని, ప్రత్యక్ష తరగతుల ద్వారానే విద్యా ప్రమాణాలు మెరుగవుతాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు ప్రారంభించడానికి ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ విజ్ఞప్తి చేయాలని సమావేశంలో తీర్మానించించారు. సమావేశంలో టీపీజేఎంఏ గౌరవ అధ్యక్షుడు వరదారెడ్డి, అధ్యక్షుడు గౌరీ సతీష్, ప్రధాన కార్యదర్వి తిరుపతిరెడ్డి, అధికార ప్రతినిధి కె.శ్రీనివాస్, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఫీజుల నియంత్రణకై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన వేసిన సబ్ కమిటీకి ఇంటర్మీడియట్ ఫీజుల విషయమై తమ సంఘ అభిప్రాయాన్ని కమిటీకి నివేదించాలని తీర్మాణించించారు. ఈ మేరకు సంబంధిత మంత్రులను, అధికారులను కలవాలని నిర్ణయించారు.