గ్రంథాలయాల సేవలను విస్తరించాలి
ABN , First Publish Date - 2022-12-13T23:20:00+05:30 IST
గ్రంథాలయాల సేవలను మూరుమూల పల్లెలకూ విస్తరింపచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు.
రంగారెడ్డి అర్బన్, డిసెంబరు13 : గ్రంథాలయాల సేవలను మూరుమూల పల్లెలకూ విస్తరింపచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. ఇటీవల నూతనంగా నియమితులైన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ను కలిశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యకలాపాలపై ఈ సందర్భంగా ప్రతీక్జైన్ సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతున్నందున నిరుద్యోగ యువతకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు సమకూర్చాలని సూచించారు. మంత్రి సబితారెడ్డి సూచన మేరకు పైలెట్ ప్రాజెక్టుగా ప్రజాపఠన కేంద్రాలను జిల్లాలో ఇప్పటికే ఏర్పాటు చేసేలా రూపొందించిన ప్రణాళికలను అమలు చేయాలని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాలను వేసవికల్లా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన గ్రంథాలయ కమిటీ సభ్యులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తానని, కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగుతామని వెంకటరమణారెడ్డి తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం. మనోజ్కుమార్, లైబ్రేరియన్ బి. సత్యనారాయణ, శరత్ పాల్గొన్నారు.