కొండా లక్ష్మణ్ చిరస్మరణీయులు
ABN , First Publish Date - 2022-09-27T05:30:00+05:30 IST
కొండా లక్ష్మణ్ చిరస్మరణీయులు
- ప్రజాప్రతినిధులు, నాయకులు
- లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాల వద్ద నివాళి
వికారాబాద్/తాండూరు/శామీర్పేట/కొడంగల్/మేడ్చల్(ఆంధ్రజ్యోతి ప్రతినిధి), సెప్టెంబరు 27: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిరస్మరణీయులని, తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన పాత్ర మరువలేనిదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్లోని అంబేద్కర్ భవనంలో కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, మునిసిపల్ చైర్పర్సన్ మంజుల, బీసీ వెల్ఫేర్ అధికారి ఉపేందర్, వీరయ్య, రాజలింగం, పద్మశాలి సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తాండూరులో కొండా లక్ష్మణ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్కుమార్, రాష్ట్ర కార్యదర్శి షుకూర్, బీసీ మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. శామీర్పేట మండలంలో, తూంకుంట మున్సిపల్లో స్వాతంత్య్ర సమరయోధులు భగత్సింగ్, కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు ఘనంగా జరుపుకున్నారు.
శామీర్పేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎల్లుబాయి, అధికారులు లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. తూంకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయాంజాల్లో భగత్సింగ్ విగ్రహానికి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు జైపాల్రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు. శామీర్పేట గ్రామంలో లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకుడు అఫ్జల్ఖాన్, నాయకులు నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ జయంతిని మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపల్స్తో పాటు మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు వక్తలు ఆయన గొప్పదనాన్ని కొనియాడారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివా్సరెడ్డి, కమిషనర్ రాములు తదితరులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు జైపాల్రెడ్డి, హేమంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా హైదరాబాద్లోని కాచిగూడలో గల అభినందన హోటల్లో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష్మణ్ జయంతి వేడుకల్లో బీసీ సంఘం కొడంగల్ తాలూకా అధ్యక్షుడు బస్వరాజ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్.కృష్ణయ్యతో చర్చించడం జరిగిందన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకుళ్తామని ఆర్.కృష్ణయ్య హామీ ఇచ్చినట్లు మన్నె బస్వరాజ్యాదవ్ తెలిపారు. అనంతరం లక్ష్మణ్ బాపూజీపై పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు చెప్పారు.