బీసీ స్టడీ సర్కిల్లో విద్యార్థులకు అన్యాయం
ABN , First Publish Date - 2022-12-12T00:20:37+05:30 IST
తాండూరు బీసీ స్టడీ సర్కిల్లో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని, స్టడీ సర్కిల్ను పట్టణంలోనే ఏర్పాటు చేయాలని అభ్యర్థులు ఆదివారం డిమాండ్ చేశారు.
స్టడీ సర్కిల్ను పట్టణంలో ఏర్పాటు చేయాలని డిమాండ్
తాండూరు, డిసెంబరు 11: తాండూరు బీసీ స్టడీ సర్కిల్లో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని, స్టడీ సర్కిల్ను పట్టణంలోనే ఏర్పాటు చేయాలని అభ్యర్థులు ఆదివారం డిమాండ్ చేశారు. తాండూరులోని ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్ డైరెక్టర్కు బీసీ స్టడీ సర్కిల్ నిర్వహణ బాధ్యను అప్పగించారు. దీంతో వారి అధ్యాపకుడే ఉదయం ప్రైవేటు సెంటర్లో, మధ్యాహ్నం స్టడీ సర్కిల్లో బోధిస్తున్నాడు. తరగతులు సక్రమంగా జరుగక తమకు అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు వాపోయారు. ఇదిలా ఉంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లోనే చేరాలని తమను ప్రేరేపిస్తున్నట్లు అభ్యర్థులు ఆరోపించారు. ప్రభుత్వ స్టడీ సర్కిల్ ప్రశ్నా పత్రంలో సైతం ప్రైవేట్ సెంటర్ పేరుతో ముద్రించారని పేర్కొన్నారు. తరగతులు సక్రమంగా జరగడం లేదని, స్టడీమెటీరియల్ ఇవ్వడం లేదన్నారు. క్లాసులకు 30 నుంచి 40 మంది అభ్యర్థులు వస్తుంటే 80మంది వస్తున్నట్టు రికార్డులు రాస్తున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. బీసీ స్టడీ సర్కిల్ను శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడంతో అధికారుల పర్యవేక్షణ సరిగా లేదన్నారు. అభ్యర్థుల సమస్యలను గుర్తించి బీసీ స్టడీ సర్కిల్ను పట్టణంలోనే ఏర్పాటు చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.