గ్రూప్ - 1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2022-10-12T04:16:12+05:30 IST
గ్రూప్ - 1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
- సమీక్షా సమావేశంలో కలెక్టర్ హరీశ్
- మేడ్చల్ జిల్లాలో 116 కేంద్రాల ఏర్పాటు
- పరీక్ష రాయనున్న 52,283 మంది అభ్యర్ధులు
మేడ్చల్ అక్టోబర్ 11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ - 1 ప్రీలిమినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు సంబంధించి ఏర్పా ట్లు చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. పరీక్ష ల నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్లో లైజనింగ్, అసిస్టెంట్ లైజనింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే గ్రూప్- 1 పరీక్షకు జిల్లాలో 116 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 52,283 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. అభ్యర్ధుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని అందుకనుగుణంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 28రూట్ మ్యాప్లను రూపొందించామని తెలిపారు. పరీక్షా గదుల్లో గాలి, వెలుతురు, సరిపడా లైటింగ్, తాగునీరు, టాయ్లెట్లు, ఫ్యాన్లు తదితర వసతులు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న స్ట్రాంగ్రూమ్లను హరీశ్ పరిశీలించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఏవో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు రవి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.