హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
ABN , First Publish Date - 2022-09-19T05:43:17+05:30 IST
హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
తలకొండపల్లి, సెప్టెంబరు 18: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ సంస్థల, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్ ఆరోపించారు. తలకొండపల్లి మండల కేంద్రంలోని దేవకి గార్డెన్లో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ 3వ మహాసభలు రెండవ రోజు ఆదివారం కొనసాగాయి. మహాసభల్లో చంద్రమోహన్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలల నుంచి బకాయి ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5వేలకు పైగా కార్మికులు పనిచేస్తున్న ప్రభుత్వ రికార్డుల ప్రకారం 3600ల మంది కార్మికులు ఉన్నట్లు సూచిస్తుందని తెలిపారు. జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారిగా కార్మికులకు రూ.15,600, కారోబార్, బిల్లు కలెక్టర్లకు రూ.19.500, కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు ఇతర పరిపాలనా విభాగంలో పనిచేస్తున్న వారికి రూ.22,750 వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో 51ను సవరించి మల్టీపర్పస్ విధానాన్ని తొలగించి కేటగిరి విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎ్సఐతో పాటు రూ.10లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో సీఐటీయూ రాష్ట్ర నాయకులు పి.సుధాకర్, జిల్లా కోశాధికారి ఎన్.మల్లేశ్, సాయిబాబా, రామ్మోహన్, గుమ్మడి కురుమయ్య, మండలాల కన్వీనర్లు శేఖర్, బుగ్గ రాములు, దేవేందర్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా వై. అశోక్, కార్యదర్శిగా గ్యార పాండులు ఎన్నికయ్యారు. తలకొండపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న 3వ మహాసభల్లో భాగంగా ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులతో పాటు 8మంది ఆఫీస్ బేరర్స్, 27మంది జిల్లా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులను సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, నాయకులు, కార్మిక సంఘం నేతలు పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందించారు.