అంత్యక్రియలకు కనాకష్టం
ABN , First Publish Date - 2022-09-14T05:22:05+05:30 IST
అంత్యక్రియలకు కనాకష్టం
మర్పల్లి,సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : వర్షాకాలంలో వాగు పొంగిందంటే ఆ ఊరి ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఒకవేళ గ్రామంలో ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు కూడా వీలుండదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో వాగు దాటాల్సిన దుస్థితి నెలకొంది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కొత్లాపూర్ గ్రామంలో సోమవారం కావలి రాములమ్మ(45) గుండెపోటుతో మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లాలంటే ఊరి వాగు దాటి వెళ్లాల్సి ఉంటుంది. వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఉదయం కావాల్సిన అంత్యక్రియలు సాయంత్రం వరకు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద ఉధృత్తి తగ్గిన తరువాత గ్రామస్తులు వాగుదాటి వెళ్లి రాములమ్మ అంత్యక్రియలను పూర్తి చేశారు. ఇలా ప్రతీయేటా వర్షాకాలంలో ఎవరైనా మరణిస్తే శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు నానా అవస్ధలు పడాల్సివస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగుపై వంతెన నిర్మించాలని పలుమార్లు ప్రభుత్వాలకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు.