విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి
ABN , First Publish Date - 2022-09-08T05:46:30+05:30 IST
విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి
షాద్నగర్రూరల్, సెప్టెంబరు7: విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ విద్యుత్ అధికారులకు సూచించారు. మండల పరిషత్ సమావేశం హాలులో బుధవారం విద్యుత్ అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో చిన్నచిన్న లోపాల వల్ల కరెంట్కు అంతరాయం కలుగుతుందని, తద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. లోపాలను గుర్తించి పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఖాజా ఇద్రిస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, డీఈ యాదయ్య, ఏడీ మాదవరావు, ఎంపీడీవో వినయ్కుమార్, ఎంఈవో శంకర్ రాథోడ్, ఎంపీవో కల్యాణి పాల్గొన్నారు.
దాతల సాయం అభినందనీయం: ఎమ్మెల్యే
కొత్తూర్: నిరుపేద రైతుకు అండగా నిలిచిన దాతల సాయం అభినందనీయమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మండలంలోని పెంజర్ల గ్రామానికి చెందిన నిరుపేద రైతు కిష్టయ్యకు చెందిన రెండు ఎద్దులను ఇటీవల గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. బాధితుడికి సర్పంచ్ మామిడి వసుంధర తనయుడు మామిడి సిద్దార్థరెడ్డి అండగా నిలిచి రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. విషయం తెలుసుకున్న మరికొంతమంది బాధితుడికి ఆర్థికసాయం చేశారు. దాతలు అందించిన రూ.95వేలతో రెండు కాడేద్దులను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా గురువారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సమక్షంలో బాధిత రైతు కిష్టయ్యకు రెండు ఎద్దులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు ఎమ్మె శ్రీలతసత్యనారాయణ, తాండ్ర విశాలశ్రావణ్రెడ్డి, కొత్తూర్ మున్సిపల్ వైస్చైర్మన్ డోలీ రవీందర్, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, సర్పంచ్ మామిడి వసుంధరరెడ్డి, ఉపసర్పంచ్ రమేష్, ఎంపీటీసీలు చింతకిందిరాజేందర్గౌడ్, భార్గవ్కుమార్రెడ్డి, నాయకులు బి. దేవేందర్యాదవ్, మెండె కృష్ణ పాల్గొన్నారు. కాగా, మండలంలోని తాగాపూర్ గ్రామానికి చెందిన లింగానికి సీఎం సహాయనిధి ద్వారా రూ.2లక్షలా 50వేలు మంజూరయ్యాయి. ఎల్వోసీని ఎమ్మెల్యే లబ్ధిదారుడికి అందజేశారు.
విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలి
షాద్నగర్అర్బన్: సమాజ శ్రేయస్సు కోసం విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఫరూఖ్నగర్ మండల పరిషత్ సమావేశ హాలులో ఫరూఖ్నగర్ మండల, జిల్లా స్థాయిల్లో ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులను బుధవారం సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కె.నరేందర్, ఎంపీపీ ఖాజా ఇద్రీ్షఅహ్మద్, జడ్పీటీసీ సభ్యుడు పి. వెంకట్రాంరెడ్డి, ఎంపీడీవో వినయ్కుమార్, ఎంఈవో శంకర్రాథోడ్ పాల్గొన్నారు.