దసరా సందడి
ABN , First Publish Date - 2022-10-05T05:14:12+05:30 IST
దసరా సందడి
- కొనుగోళ్లతో కిక్కిరిసిన మార్కెట్ రోడ్లు
మేడ్చల్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మేడ్చల్ మార్కెట్ రోడ్లన్నీ కిక్కిరిశాయి. మేడ్చల్ ప్రధాన మార్కెట్ రోడ్లు పూర్తిగా గుమ్మడికాయలు, బంతిపూలు, మా మిడి ఆకులు తదితర వాటితో నిండిపోయాయి. మరోవైపు వీటిని కొనుగోలు చేసేందుకు వచ్చే వారితో మేడ్చల్ మార్కెట్ రద్దీగా మారింది. డిపో ముందు నుంచి జాతీయరహదారి పక్కనే గల సర్వీసు వివేకానంద చౌరస్తా మీదుగా నాలుగు రోడ్ల చౌరస్తా వరకు రోడ్డుకిరువైపులా చిరువ్యాపారులు దసరా పండుగకు కొనుగోలు చేసే వస్తుసామగ్రితో నింపేశారు. మార్కెట్లో ఏ వైపు చూసినా సందడే నెలకొంది. రంగురంగు పూలు, గుమ్మడికాయలతో మార్కెట్ నిండిపోయింది. దీనికితోడు పరిసర ప్రాంతాల నుంచి వ్యాపారులు ప్రత్యేక వాహనాల్లో బంతిపూలను తెచ్చి మేడ్చల్ ఐటీఐ నుంచి చెక్పోస్టు వరకు జాతీయరహదారి పక్కనే విక్రయించారు. దుకాణదారులు దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున బంతిపూలను, పూజా సా మగ్రిని కొనుగోలు చేశారు. మరోవైపు దసరా పర్వదినానికి సొంతూళ్లకు వెళ్లే వారితే ఆర్టీసీ డిపో వద్ద ప్రయాణికుల సందడి నెలకొంది. ఒక్క రోజు ముందే మేడ్చల్లో దసరా పండుగ వాతావరణం కనిపించింది. వ్యాపారులు తమ దుకాణాల ముందు మామిడి ఆకులు, బంతిపూల తోరణాలతో పూజకు ఏర్పాట్లు చేసుకున్నారు. మేడ్చల్లోని ఏడుగళ్ల ఆలయం వద్ద, చెరువు కట్టపై గల అమ్మవారి ఆలయం వద్ద, గడిమైసమ్మ ఆలయం వద్ద వాహనదారులు తమ వాహనాలకు పూ జలు చేయించారు. ఇంకొందరు ఇళ్ల వద్ద వాహనాలను కడిగి పూజలు నిర్వహించారు.