చిట్‌ఫండ్‌ మోసాలపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-07-19T05:03:54+05:30 IST

చిట్‌ఫండ్‌ మోసాలపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు

చిట్‌ఫండ్‌ మోసాలపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు
మంత్రి కేటీఆర్‌కు బాధితుడు చేసిన ట్వీట్‌

  •  కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్న పోలీసులు

తాండూరు, జూలై18 : తాండూరులో బాలాజీ ప్రైవేట్‌ చిట్‌ఫండ్‌ మోసాలపై బాధితులు ట్విట్టర్‌ వేదిగా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు.  చిట్‌ఫండ్‌   యాజమాన్యం చిట్టీ డబ్బులు చెల్లించకుండా కోట్ల రూపాయలు వెనకేసుకుని హైదరాబాద్‌కు మకాం మార్చారని, ఫోన్లు చేస్తే ఎత్తడం లేదని, చిట్టీ డబ్బులు  ఎగ్గొట్టేందుకు చూస్తున్నారని  బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2021 సంవత్సరం నుంచి ముఖం చాటేసి చిట్టీ డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఆంధ్రజ్యోతిలో వ చ్చిన కథనాన్ని కూడా మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో పంపించారు. తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు ప్రభాకర్‌ తనకు రూ.81లక్షలు రావాల్సి ఉందని, 25మందికి పైగా పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే మొన్నటి వరకు డబ్బులు వస్తాయని ఎదురు చూసిన వారు ఒక్కొక్కరుగా ఆశలు వదులుకుంటూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇట్టి విషయంలో తమకు సహకరించి పేదలకు న్యాయం చేయాలని ట్విట్టర్‌లో పలువురు బాధితులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సంబంధిత చిట్‌ఫండ్‌ యాజమాన్యంపై పోలీసు స్టేషన్‌లో వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా, మరిన్ని ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎస్పీకి బాధితులు కలిసి ఫిర్యాదు చేశారు.  ఎస్పీ కూడా ఈ విషయంలో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. 

Updated Date - 2022-07-19T05:03:54+05:30 IST