అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్న బీజేపీ

ABN , First Publish Date - 2022-08-22T04:33:41+05:30 IST

తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని జీర్ణించుకోలేని

అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్న బీజేపీ
మంత్రి నిరంజన్‌రెడ్డిని సన్మానిస్తున్న గంప వెంకటేశ్‌, దశరథ్‌ నాయక్‌

  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

కడ్తాల్‌ ,ఆగస్టు 21: తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని జీర్ణించుకోలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ది సాధ్యమని, అన్నివర్గాలకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కడ్తాల మండల కేంద్రంలో ఆదివారం ఓ వివాహ వేడుకలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి నిరంజన్‌రెడ్డి స్థానిక జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌ నివాసం వద్ద ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, పలువురు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, జడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌ మంత్రి నిరంజన్‌రెడ్డిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ సంస్థల కొమ్ముకాస్తూ రైతులను వేదనకు గురి చేస్తుందని మంత్రి ఆరోపించారు. రైతుల శ్రేయస్సు, వ్యవసాయరంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటుందని నిరంజన్‌రెడ్డి చెప్పారు. రాజకీయలబ్ధి కోసం బీజేపీ నేతలు నీచ రాజకీయాలకు ఒడిగట్టారన్నారు. ప్రధానిమోదీ వైఫ్యలాలను, ప్రజావ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతున్నందుకే బీజేపీ కేంద్రమంత్రులు, ఆ పార్టీ నాయకులు తప్పుడు విమర్శలకు ఒడిగట్టారన్నారు. రాష్ట్రాభివృద్దికి కేంద్ర సహకరించకపోగా అడ్డుకునే చర్యలు చేపడుతుందని నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ కడారి రామకృష్ణ, నాయకులు బాలకృష్ణ, జమీర్‌, రవి, శివలింగం, సాయికుమార్‌, శ్రీకాంత్‌, ఈర్ష్యద్‌, రాజేశ్‌, అంజి, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-22T04:33:41+05:30 IST