వదలని ముసురు

ABN , First Publish Date - 2022-09-12T05:14:39+05:30 IST

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లాలో

వదలని ముసురు
చేవెళ్ల మండలంలో పత్తి పొలంలో చేరిన వర్షం నీరు

రంగారెడ్డిఅర్బన్‌/చేవెళ్ల/చౌదరిగూడ/యాచారం, సెప్టెంబరు 11 : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాం తాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా చెరువుల్లోకి వరద చేరుతుంది. చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్‌లో అత్యధికంగా 48.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేశంపేట మండలం తొమ్మిడి రేకులలో 33.8 మిల్లీమీటర్లు, తలకొండపల్లి మండలం చుక్కాపూర్‌లో 32.0 మిల్లీమీటర్లు, కేశంపేటలో 29.5 మిల్లీమీటర్లు, ఆమనగల్లులో 28.0 మిల్లీమీటర్లు, తలకొండపల్లి మండలం వెల్జాల్‌లో 26.0 మిల్లీమీటర్లు, శంకర్‌పల్లిలో 21.5 మిల్లీమీటర్లు, మాడ్గులలో 20.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

చేవెళ్ల డివిజన్‌ పరిధిలో శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు తుంపర్ల వర్షం కురిసింది. దీంతో పంటపొలాల్లో వర్షం నీరు చేరింది. చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ తదితర మండలాలల్లో వర్షం కురిసింది. 

చౌదరిగూడ మండలంలో కురుస్తున్న వర్షాలకు వీరన్నపేట్‌ గ్రామంలో ఓ నిరుపేద వృద్ధురాలి ఇంటి గోడ కూలింది. గ్రామానికి చెందిన గడ్డ బేగం అనే వృద్ధురాలు నిన్న రాత్రి భోజనం చేసి ఇంట్లో పడుకుంది. రాత్రి కురిసిన వర్షానికి ఆమె ఇంటి గోడ కూలడంతో ఉల్కికి పడింది. వృద్ధురాలికి ఎలాంటి గాయాలు  కాలేదు. బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామన్తులు కోరారు. 

యాచారం మండలంలో కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. ముఖ్యంగా టమాట తోటలు పూర్తిగా పాడైపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మండలంలోని పలుగ్రామాల్లో 400 ఎకరాల్లో టమాట పంటలు దెబ్బతిన్నాయి. 



Updated Date - 2022-09-12T05:14:39+05:30 IST