పోడు అర్జీలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-10-13T04:14:29+05:30 IST
పోడు అర్జీలను పరిష్కరించాలి
వికారాబాద్, అక్టోబరు12: పోడు భూముల సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పోడు వ్యవసాయ భూముల పురోగతిపై రెవెన్యూ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. అక్టోబరు నెలాఖరులోగా సమస్యలను పరిష్కరించాలన్నారు. వచ్చిన అర్జీలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని క్షేత్రస్థాయిలో వెళ్లి ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అదే విధంగా సర్వే పూర్తి అయిన వాటిని వివరాలను మొబైల్యాప్లో పొందుపర్చాలని కలెక్టర్ సూచించారు. ధ్రువీకరణ, సర్వే ప్రక్రియ చేపట్టే ముందు గ్రామాల్లో చాటింపు వేయించాలన్నారు. ప్రతి రోజు ఎఫ్ఆర్సీ కమిటీలు తప్పని సరిగా ధ్రువీకరణకు వెళ్లాలని, అలాగే ధ్రువీకరణ ప్రక్రియను సమగ్రంగా రోజు వారీగా డివిజన్స్థాయి కమిటీకి పంపాలని సూచించారు. పోడు భూముల అర్జీల పరిష్కార నివేదికలు పూర్తి అయ్యే వరకు అధికారులు, సిబ్బంది ఎవరు కూడా సెలవుల్లో వెళ్లొద్దని సూచించారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ, ఏడీ రాంరెడ్డి, తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్లు పాల్గొన్నారు.