పారదర్శకంగా వీఆర్వోల సర్దుబాటు
ABN , First Publish Date - 2022-08-02T05:10:15+05:30 IST
జిల్లాలో వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ పారదర్శకంగా జరిగింది
- ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేటాయింపు
- కలెక్టరేట్లో డ్రా తీసిన కలెక్టర్ అమయ్కుమార్
- 40 శాఖల్లో 270 మంది వీఆర్వోల బదలాయింపు
రంగారెడ్డి అర్బన్, ఆగస్టు 1 : జిల్లాలో వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ సోమవారం తన ఛాంబర్లో జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో డ్రా పద్ధతిన వీఆర్వోల సర్దుబాటు చేశారు. ఈ ప్రక్రియను వీడియో ద్వారా చిత్రీకరించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆయా శాఖలో ఉన్న ఖాళీలకు అనుగుణంగా వీఆర్వోలను కేటాయించారు. జిల్లాలో మొత్తం 274మంది వీఆర్వోలను 40శాఖల్లో సర్దుబాటు చేశారు. అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ శాఖలోకి 14మంది వీఆర్వోలను సర్దుబాటు చేయగా.. పశుసంవర్ధక శాఖ, డెయిరీ డెవలె్పమెంట్ అండ్ మత్స్యశాఖలోకి ఇద్దరు వీఆర్వోలను, బీసీ వెల్ఫేర్ శాఖలోకి ఒకరు, ఫారె్స్టశాఖలో ఇద్దరిని సర్దుబాటు చేశారు. అలాగే ఫైనాన్స్లోకి ఇద్దరు, పౌరసరఫరాల శాఖకు ఇద్దరిని కేటాయించారు. జనరల్ అడ్మిషన్లోకి ముగ్గురు, హెల్త్ అండ్ మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్టుమెంట్లోకి 13 మంది వీఆర్వోలను సర్దుబాటు చేశారు. ఉన్నత విద్యాశాఖలోకి 47 మంది, హోం శాఖలోకి 23 మంది, నీటి పారుదల శాఖలోకి ఐదుగురు వీఆర్వోలను సర్దుబాటు చేశారు. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శాఖలోకి 10మంది, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోకి ఒకరు, మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ అండ్ అర్బన్ డెవల్పమెంట్కు అత్యధికంగా 81 మందిని కేటాయించారు. అలాగే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవల్పమెంట్లోకి 40మంది, రెవెన్యూశాఖలోకి 8మంది, సెకండరీ ఎడ్యూకేషన్ శాఖలోకి ఐదుగురు వీఆర్వోలను సర్దుబాటు చేశారు. రోడ్డు అండ్ ట్రాన్స్పోర్టు, బిల్డింగ్ డిపార్టుమెంట్లోకి ఏడుగురిని, గిరిజన శాఖలోకి ఒకరు, మహిళా శిశు సంక్షేమ, వికలాంగులు, వృద్ధుల శాఖలోకి ఆరుగురు, యూత్ డెవల్పమెంట్, టూరిజమ్ అండ్ కల్చర్లోకి ఒకరిని, ఎన్సీసీలోకి ఒకరిని సర్దుబాటు చేశారు. వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఏవో ప్రమీల, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి శ్రీధర్, సీపీవో ఓం ప్రకాష్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
జీవోను పూర్తిగా వ్యతికేకిస్తున్నాం
వీఆర్వోలను ఇతర శాఖలోకి సర్దుబాటు చేస్తూ విడుదల చేసిన జీవో వల్ల వీఆర్వోలకు ఉపయోగం లేదు. రెవెన్యూ శాఖలో ఖాళీ పోస్టులు చాలా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయకుండా ఇతర శాఖల్లోకి బదిలీ చేయడం మంచిది కాదు. ఏకపక్షంతో లాటరీ పద్ధతి ద్వారా బదలాయింపు చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తమ సమస్యల పట్ల మరోసారి పునరాలోచించాలి.
- జి.వినయ్, వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు