ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు
ABN , First Publish Date - 2022-11-25T00:10:36+05:30 IST
ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ విద్యార్థి గల్లంతైన ఘటన ఆదిభట్ల పీఎస్ పరిధిలోని నాదర్గుల్లో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.
ఆదిభట్ల, నవంబరు 24: ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ విద్యార్థి గల్లంతైన ఘటన ఆదిభట్ల పీఎస్ పరిధిలోని నాదర్గుల్లో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. చంపాపేట్ గ్రీన్పార్క్ కాలనీకి చెందిన పవన్ జన్మదిన సందర్భంగా 12మంది స్నేహితులు కలిసి కుర్మల్ గూడ చెరువు కట్టపై పార్టీ చేసుకున్నారు. అనంతరం బాలాపూర్ మండలం నాదర్గుల్ రెవెన్యూ పరిధిలో గతంలో మట్టి కోసం తీసిన గుంతలో ఈ మధ్య కురిసిన వర్షానికి నీరు చేరడంతో ఈతకోసం 12మంది వెళ్లారు. నీటి గుంతలో రాళ్లు ఎక్కువగా ఉండటంతో వాటిపై ఆడుతూ మల్లికార్జున్ అలియాస్ దత్తు(16 సంవత్సరాలు) గుంతలో జారిపడ్డాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు. గుంతలో లోతు ఎక్కువగా ఉండటంతో పాటు రాత్రి కావడంతో గజఈతగాళ్లను రప్పించినా దత్తు ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో శుక్రవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.