రోడ్డు ప్రమాదాలను నివారించాలి
ABN , First Publish Date - 2022-08-31T05:36:13+05:30 IST
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
ములుగు కలెక్టరేట్, ఆగస్టు 30: జిల్లాలో జాతీయ రహదారిపై జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సంబంధిత శాఖల అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో రోడ్డు రవాణా సంస్థ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, పోలీస్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో సైన్బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారి ఏయే ప్రదేశాలలో ధ్వంసమైందో పరిశీలించి నివేదికలు సమర్పించా లన్నారు. జాతీయ రహదారి పనులను సెప్టెంబరు వరకు పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల నివేదికను ఎస్పీకి సమర్పించాలని అన్నారు. ఇసుక రీచ్ల నుంచి వచ్చే లారీలు ఓవర్లోడ్ను నియంత్రించి బ్రాహ్మణపల్లి చెక్పోస్టు, జవహర్నగర్ టోల్ప్లాజా వద్ద సీసీ కెమెరాలు, వీడియో ఫొటోగ్రఫీ తప్పకుండా రికార్డు చేయాలని ఆదేశించారు. చెక్పోస్టు వద్ద షిప్టుల వారీగా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు.భద్రాచలం మీదుగా వచ్చే ఇసుక లారీలను, అక్రమంగా వచ్చే వాహనాలను గుర్తించాలని అన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా రోడ్లు, భవనాల శాఖ నిబంధనల ప్రకారం ఎన్ని మొక్కలు నాటారు.. సైన్బోర్డులు, లైటింగ్, సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేశారు.. ఇంకా ఎన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది..? తదితర అంశాలపై ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ.గణేష్, డీఆర్వో రమాదేవి, ఏఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్, రోడ్డు రవాణాసంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.