24న ప్రగతిభవన్‌ ముట్టడి: ఓసీ సంఘాలు

ABN , First Publish Date - 2022-08-01T08:41:01+05:30 IST

ఓసీల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆగస్టు 24న ప్రగతిభవన్‌ ముట్టడితోపాటు రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల ఇళ్లముందు ధర్నాలు నిర్వహించనున్నట్టు పలు ఓసీ సంఘాల..

24న ప్రగతిభవన్‌ ముట్టడి: ఓసీ సంఘాలు

బర్కత్‌పుర, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఓసీల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆగస్టు 24న ప్రగతిభవన్‌ ముట్టడితోపాటు రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల ఇళ్లముందు ధర్నాలు నిర్వహించనున్నట్టు పలు ఓసీ సంఘాల నేతలు వెల్లడించారు. అగ్రవర్ణ పేదలకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నేరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఆదివారం బషీర్‌బాగ్‌ జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు, రెడ్డి సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పమ్మగారు రాంరెడ్డి, ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సా శ్రీనివాస్‌, బ్రాహ్మణ సంఘాల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్‌శర్మ, వెలమ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నమనేని పురుషోత్తంరావు, కమ్మసేవా సమితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధర్మవరపు రామకృష్ణ ప్రసాద్‌ మాట్లాడారు. రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అగ్రవర్ణ పేదలకు సీఎం ఇచ్చిన హామీని తక్షణమే నేరవేర్చాలన్నారు. విదేశీ విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓసీ విద్యార్థులకు రూ.25 లక్షలు, అగ్రవర్ణ పేదల సంక్షేమానికి రూ.1,000 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 22లోగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఓసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరుబాట తప్పదని వారు హెచ్చరించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించ కుంటే మంత్రుల కార్యక్రమాలను అడుగడుగునా అడ్డుకుంటామన్నారు. 

Updated Date - 2022-08-01T08:41:01+05:30 IST