‘దళిత బంధు’పై అపోహలు వద్దు : కలెక్టర్
ABN , First Publish Date - 2022-03-16T07:06:12+05:30 IST
దళిత బంధు పథకంలో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావులేదని కలెక్టర్ సి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకానికి సంబంధించిన నిధులు ఇప్పటికే జిల్లాకు మంజూరై సిద్ధంగా ఉన్నాయని, ఏప్రిల్ మొదటి వారం నుంచి యూనిట్ల స్థాపన కోసం నిధులు కేటాయిస్తామని తెలిపారు.
ఎడపల్లి, మార్చి 15: దళిత బంధు పథకంలో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావులేదని కలెక్టర్ సి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకానికి సంబంధించిన నిధులు ఇప్పటికే జిల్లాకు మంజూరై సిద్ధంగా ఉన్నాయని, ఏప్రిల్ మొదటి వారం నుంచి యూనిట్ల స్థాపన కోసం నిధులు కేటాయిస్తామని తెలిపారు. మంగళవారం మండలలోని పోచారం గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులుగా ఎంపికైన సురేష్, మమత, ముత్తన్నల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. ఎంచుకున్న యూనిట్లు ఏమిటీ, వాటి నిర్వహణలో ఏమైనా అనుభవం ఉందా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ స్ర్పేయర్ వంటి యూనిట్లను ఎంచుకుంటే అధిక లాభాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ సూచించారు. వంద మంది వరకు లబ్ధిదారులు డ్రోన్ స్ర్పేయర్ యూనిట్ల స్థాపనకు ముందుకు వస్తే జిల్లా యంత్రాంగం తరపున పూర్తి మద్దతుగా నిలుస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు. అవసరమైతే సంబంధిత కంపెనీలతో మాట్లాడి డ్రోన్ స్ర్పేయర్ల నిర్వహణపై శిక్షణ ఇప్పిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎడపల్లిలోని రైతు వేదిక భవనంలో బోధన్ నియోజక వర్గ దళిత బంధు లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. దళిత బంధు పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ప్రతి దళిత కుటుంబానికి దశల వారీగా లబ్ధి చేకూర్చబడుతుందన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాజేశ్వర్, జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితయాదవ్, ఎంపీపీ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, సర్పంచ్ మాధవి, ఆయా మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
జిల్లా భూగర్భ జల నివేదిక విడుదల..
నిజామాబాద్ అర్బన్: 2019-20 సంవత్సరానికి సంబంధించిన జిల్లా భూగర్భ జల నివేదికను కలెక్టర్ నారాయణరెడ్డి విడుదల చేశారు. అంచనాల ప్రకారం రాష్ట్ర సగటు భూగర్భ జల వినియోగం 50శాతం ఉండగా జిల్లాలో 70శాతానికి పైగా గణించడం జరిగిందని భూగర్భ జల ఉపసంచాలకుడు దేవంద్రప్రసాద్ తెలిపారు. జిల్లాలోని 29 మండలాలకుగాను 16 మండలాలు సాధారణ స్థాయిలో (నీటి వినియోగం 69 శాతంలోపు), 9 మండలాలు సెమిక్రిటికల్ (70 శాతం నుంచి 90శాతం) ఒక మండలం క్రిటికల్ (90 నుంచి 100శాతం) 3 మండలాలలు అతి వినియోగం (100 శాతానికి ఎక్కువ) ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. 2017 గణంకాల ప్రకారం 101 ఓఈ గ్రామాలు ఉండగా ఇప్పుడు అవి 93 తగ్గాయని క్రిటికల్, ఓఈ మండలాల్లో అధికంగా వర్షం నీటిని ఇంకించే కట్టడాలు చేపట్టి భూగర్భ జలాలను పెంచాల్సి ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రమిశ్రా, డీఎఫ్వో సునీత, అధికారులు పాల్గొన్నారు.