గంగమ్మ ఒడికి గణనాథులు

ABN , First Publish Date - 2022-09-10T06:09:10+05:30 IST

నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజలందుకున్న వినాయకుడు శుక్రవారం గంగమ్మ ఒడికి చేరాడు. జిల్లాలోని పలు మండలాల్లో పెద్దఎత్తున శోభాయాత్రలు, గణేష్‌ నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. తాడ్వాయి, బీబీపేట, మాచారెడ్డి, సదాశివనగర్‌, భిక్కనూర్‌, దోమకొండతో పాటు పలు మండలాల్లో శోభాయాత్రలు నిర్వహించి డప్పు, బ్యాండు వాయిద్యాలతో నిమజ్జన కార్యక్రమాలు చేపట్టారు.

గంగమ్మ ఒడికి గణనాథులు
కామారెడ్డిలో శోభాయాత్రను ప్రారంభిస్తున్న ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి

ఫ జిల్లాలో ఘనంగా వినాయక నిమజ్జనం
ఫ జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమైన వినాయక నిమజ్జన శోభాయాత్ర
ఫ నిమజ్జనానికి తరలుతున్న గణనాథులు
ఫ భాగ్యనగరాన్ని తలపించేలా శోభాయాత్ర
ఫ నిమజ్జనానికి పోలీసుల భారీ బందోబస్తు
ఫ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు
ఫ సీసీ కెమెరాలు, వీడియో కెమెరాల పర్యవేక్షణలో సాగిన శోభాయాత్ర



కామారెడ్డి/కామారెడ్డి టౌన్‌, సెప్టెంబరు 9: నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజలందుకున్న వినాయకుడు శుక్రవారం గంగమ్మ ఒడికి చేరాడు. జిల్లాలోని పలు మండలాల్లో పెద్దఎత్తున శోభాయాత్రలు, గణేష్‌ నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. తాడ్వాయి, బీబీపేట, మాచారెడ్డి, సదాశివనగర్‌, భిక్కనూర్‌, దోమకొండతో పాటు పలు మండలాల్లో శోభాయాత్రలు నిర్వహించి డప్పు, బ్యాండు వాయిద్యాలతో నిమజ్జన కార్యక్రమాలు చేపట్టారు. ఇక  కామారెడ్డి జిల్లా కేంద్రంలో అట్టహాసంగా వినాయకుడి శోభాయాత్రను శుక్రవారం రాత్రి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. భాగ్యనగర్‌ను తలపించేలా కామారెడ్డిలో వినాయకుడి శోభాయాత్రను విశ్వహిందు పరిషత్‌, గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, ఏఎస్పీ అనోన్య, ట్రైనీ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, ఆర్డీవో శ్రీనివాస్‌నాయక్‌ పాల్గొన్నారు. ఇందిరాచౌక్‌ నుంచి యువజన సమాఖ్య గణపతి శోభాయాత్ర సిరిసిల్లా రోడ్డులోని ధర్మశాల నుంచి డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాలు, పాటలకు అనుగుణంగా యువకులు చిందులు వేస్తూ శోభాయాత్రను ప్రారంభించారు. మహిళలు శోభాయాత్రకు ఎదురొచ్చి మంగళహారతులు పట్టారు. మండపాల్లో పూజలందుకున్న గణపయ్యలు అందంగా అలంకరించిన వాహనాలపై కొలువుదీరారు. రంగురంగుల విద్యుత్‌ దీపాలు, అందంగా అలంకరించిన పూలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న రథయాత్రపై ఆసీనులైన గణనాథులు భక్తుల మధ్య ముందుకు కదిలాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య శోభాయాత్ర ప్రారంభమైంది.
జన సంద్రంగా కామారెడ్డి
గణేష్‌ నిమజ్జనోత్సవానికి కామారెడ్డిలోని రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. శోభాయాత్ర జరిగే వీధులు సిరిసిల్లా రోడ్డు, స్టేషన్‌ రోడ్డు, సుభాష్‌రోడ్డు, తిలక్‌రోడ్డు, జేపీఎన్‌ రోడ్డు, మాయబజార్‌, వేణుగోపాల్‌ స్వామి రోడ్డు, పెద్దబజార్‌ రోడ్లన్నీ భక్తులతో కిక్కిరిశాయి. శోభా యాత్రకు ప్రత్యేక ఆకర్షణగా ఉండే విధంగా గణేష్‌ మండపాల నిర్వాహకులు వివిధ అలంకరణలతో దేదీప్యమానంగా, రమణీయ ంగా వెలుగొందే రంగురంగుల విద్యుత్‌ దీపాల అలంకరణలతోపాటు పూలతో అలంకరణ చేసిన రఽథాలను మండపాల నిర్వాహకులు పోటాపోటీగా తీర్చిదిద్దారు. మండపాల నుంచి గణనాథులు కదిలేముందు లడ్డూ వేలాలను నిర్వహించారు.
డప్పు వాయిద్యాలు - యువకుల నృత్యాలు
కామారెడ్డిలో వినాయక నిమజ్జన శోభాయాత్రకు డప్పు వాయిద్యా లు, యువకుల నృత్యాలు పాటలకనుగుణంగా లేజర్‌ కిరణాల మధ్య భూమి కంపించే విధంగా రణగోణ ధ్వనులతో వివిధ బ్యాండ్లు, డప్పు చప్పుళ్ల మధ్య గణేష్‌ శోభాయాత్ర ఉత్సాహంగా కొనసాగింది.  కాగా శనివారం సాయంత్రం వరకు కామారెడ్డి శివారులోని టేక్రియాల్‌ సమీపంలో గల అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నిమజ్జనం చేయ నున్నారు.  కామారెడ్డిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పలు భారీ విగ్రహాలను, మట్టి వినాయకులను పలు సంఘాల వారు, ఇళ్లలో నెలకొల్పిన విగ్రహాలను సైతం పలువురు శుక్రవారం నిమజ్జనం చేశారు.
జిల్లాలో భారీ పోలీసు బందోబస్తు
కామారెడ్డిలో వినాయక శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో  ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 7 గురు సీఐలు, 55 మంది ఎస్‌ఐలు, 100 మంది ఏఎస్‌ఐలు, హోంగార్డులు బందోబస్తు విధులు నిర్వహించారు. ఇక వీరితో పాటు స్పెషల్‌పార్టీ పోలీసులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు బందోబస్తులో సేవలు అందించనున్నారు. ట్రాఫిక్‌ సమ స్య లేకుండా, పట్టణంలో భారీ వాహనాలు తిరగకుండా భారీకేడ్‌లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్లా రోడ్డు లోని ఇందిరాచౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై పట్టణ ప్రముఖులు గణనాథులకు స్వాగతం పలికారు. గణేష్‌ వేడుకల ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. భక్తుల సందడితో కామారెడ్డి వీధులన్నీ కళకళలాడాయి. చెరువు వద్ద భారీకెడ్లు, క్రేన్‌తో పాటు గజ ఈతగాళ్లు, లైటింగ్‌ను మున్సిపల్‌ అధికారులు ఏర్పాటు చేశారు. గణేష్‌ మండపాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చెరువు వద్ద కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పడు సమాచారం అందించారు.

Updated Date - 2022-09-10T06:09:10+05:30 IST