పేదలకు న్యాయం జరిగే వరకూ పోరాటం
ABN , First Publish Date - 2022-02-16T06:23:48+05:30 IST
దేశంలో ఉన్న పేద ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తూనే ఉంటామని ఆలిండియా పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్గౌడ్, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డితో కలిసి రైతులు, పేదలు, మహిళలు పడుతున్న సమస్యలను మీనాక్షి నటరాజన్ అడిగి తెలుసుకున్నారు.
ఆల్ ఇండియా రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ చైర్మన్ మీనాక్షి నటరాజన్
మెండోరా, ఫిబ్రవరి 15: దేశంలో ఉన్న పేద ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తూనే ఉంటామని ఆలిండియా పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్గౌడ్, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డితో కలిసి రైతులు, పేదలు, మహిళలు పడుతున్న సమస్యలను మీనాక్షి నటరాజన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది పెత్తందారులు వారి కుటుంబ బాగుకోసం పేదల భూములు లాక్కొని కోట్లరూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. పోరాటి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాంధీని చంపిన గాడ్సేనే గొప్పవాడని కొంతమంది నాయకులు అనడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆరుగాలం కష్టపడి పండిస్తున్న రైతులకు రైతుబంధు కాదు.. రైతులకు మద్దతు ధర కల్పించాలని అన్నారు. సమస్యల పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా రాహూల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మార్చి 14 నుంచి బదేవ్ పోచంపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొత్తింటి ముత్యం రెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షురాలు నీరడి భాగ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు త్వరలో పాదయాత్ర..
ఇందల్వాయి: మండలంలోని సిర్నపల్లిలో ఆల్ ఇండియా రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ చైర్మన్ మీనాక్షి నటరాజన్ పర్యటించారు. బుధవారం సిర్నపల్లి గడిని పరిశీలించి పలు సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆల్ ఇండియా భూ సర్వోదయ సంస్థాన్ చైర్మన్ నీలాఅప్డే మాట్లాడుతూ.. సర్వోదయ భూదాన్ యాత్ర 75 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా మార్చి 14 నుంచి ఏప్రిల్ 18 వరకు సర్వోదయ సంస్థాన్ ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లి నుంచి మహరాష్ట్రలోని సేవాగ్రామ్ వరకు 600 కి.మీల పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ 19 కి.మీలు పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడు సంవత్సరాలలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ స్వార్థ రాజకీయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. త్వరలో చేపట్టనున్న యాత్ర ద్వారా ప్రజలు, రైతులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడమే యాత్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆల్ ఇండియా పంచాయతీరాజ్ రాష్ట్ర చైర్మన్ రాజమల సిద్దేశ్వర్ మాట్లాడుతూ.. నిధులు, నియామకాలు, నీళ్లు పేరుతో ఏర్పడ్డ తెలంగాణలో ప్రజలు పూర్తిగా మోసపోయారని కేవలం కుటుంబ పాలన కొనసాగిస్తూ గ్రామాలకు నిధులు ఇవ్వకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో సర్పంచ్లు అప్పులు చేసి ఆత్మహత్యచేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్వోదయ సంస్థాన్ చైర్మన్ నీలాఆప్డె, రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ రాష్ట్ర చైర్మన్ రాజమల సిద్దేశ్వర్, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్గౌడ్, ఈరవత్రి అనిల్, మానాల మోహన్రెడ్డి, తాహెర్బిన్ హుందాన్, భూపతిరెడ్డి, నగేష్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.