అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి
ABN , First Publish Date - 2022-11-27T23:54:49+05:30 IST
జిల్లా కేంద్రంలోని అడ్లూర్లో గల పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు.
కామారెడ్డి, నవంబరు 27: జిల్లా కేంద్రంలోని అడ్లూర్లో గల పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం బూత్స్థాయి అధికారి అందించే సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలు, మహిళలు, పురుషుల వివరాలు ఆరా తీశారు. దివ్యాంగులను గుర్తించి సదరం డేటా ద్వారా ఓటరు జాబితాలో పేర్లను నమోదు చేయాలని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలి
బిచ్కుంద: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు తప్పనిసరిగా పొందాలని ఆర్డీవో రాజాగౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని బండ రెంజల్, పుల్కల్, దేవాడ గ్రామాల్లో పోలింగ్బూత్లను ఆయన పరిశీలించారు. ఓటరు లిస్టులను పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజు పటేల్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు తహసీల్ధార్ రవికాంత్, ఆర్ఐ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.