గ్రామాలకు రాని ‘పల్లె వెలుగు’

ABN , First Publish Date - 2022-09-13T05:46:30+05:30 IST

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన విధించడంతో ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు.

గ్రామాలకు రాని ‘పల్లె వెలుగు’
మోటకొండూరు బస్టాండ్‌లో బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు

  కరోనా సాకుతో ఆర్టీసీ బస్సులను నిలిపివేసిన అధికారులు

  ప్రజలు, విద్యార్థులకు తప్పని తిప్పలు

మోటకొండూరు, సెప్టెంబరు 12: కరోనా నేపథ్యంలో లాక్‌డౌన విధించడంతో ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. లాక్‌డౌన ఎత్తివేసిన తర్వాత కూడా అధికారులు మోటకొండూరు మండలంలో ఆర్టీసీ సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించకపోవడంతో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు సౌకర్యం లేక ఆయా గ్రామాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సేవలు ప్రజలకు దూరం కావడంతో అధిక ఛార్జీలు వెచ్చించి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తూ అవస్థలు పడుతున్నారు. దీంతో అదే అదునుగా ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. 

గతంలో 22 ట్రిప్పులు ..

మోటకొండూరు మండలంలో 18గ్రామ పంచాయతీల పరిధిలో 25 గ్రావమాలు ఉన్నాయి. కరోనా లాక్‌డౌనకు ముందు మండల కేంద్రం మీదుగా వర్టూరు, మాటూరు, అమ్మనబోలు, చందేపల్లి, చామాపూర్‌, తేర్యాల ఎక్స్‌ రోడ్డు, పల్లె పహాడ్‌, ఉప్పల పహాడ్‌ మీదుగా మోత్కూరు వరకు, సింగారం, ఆత్మకూర్‌ వరకు 22 ట్రిప్పులు ఆర్టీసీబస్సులు అధిక లాభాలతో నడిచేవి. వీటికి తోడు ఆలేరు నుంచి నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేటకు నల్లగొండ డిపో నుంచి 2 ఆర్టీసీ బస్సులు ఉదయం, సాయంత్రం నడపడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. కరోనా లాక్‌డౌనతో ఈ గ్రామాలకు వచ్చే ఆర్టీసీ సేవలను రద్దు చేశారు. 

ఒకే బస్సును పునరుద్ధరించిన అధికారులు 

 భువనగిరి నుంచి మోటకొండూరుకు ఒక బస్సు మోటకొండూరు నుంచి భువనగిరి జిల్లా కేంద్రానికి ఒక బస్సు పునరుద్ధరించి మిగతా గ్రామాలను విస్మరించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అధిక చార్జీలు వెచ్చించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మరికొంత మంది అధిక చార్జిలు వెచ్చించలేక కాలినడకన చేరుకుంటున్నారు. ఇప్పటికెనా అధికారులు, పాలకులు స్పందించి ఆర్టీసీ బస్సులు నిలిపివేసిన గ్రామాలకు తిరిగి పునరుద్ధరించాలని విద్యార్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.  

బస్సులు అందుబాటులో లేక ఆటోలో వెళ్తున్నాం

వర్టూరు-మోటకొండూరుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో అధిక చార్జీలు పెట్టి ఆటోలో పాఠశాలలకు వెళ్తున్నాం. అయినప్పటికీ సకాలంలో ఆటోలు రాకపోవడంతో తరగతులకు దూరమవుతున్నాం. ఇప్పటికెనా అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించి, సమస్య పరిష్కరించాలి. 

-సిరివల్లి, 10వ తరగతి వర్టూరు 

 బస్సు సౌకర్యం కల్పించాలి 

గ్రామాలకు వచ్చే ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించాలి. బస్సులు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అధిక చార్జీలు వెచ్చించి, ప్రైవేటు వాహనాల్లో ప్రమాదకరమని తెలిసినా ప్రయాణం కొనసాగిస్తున్నారు. స్కూళ్లు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.  

 -వడ్డెబోయిన శ్రీలత, మోటకొండూరు సర్పంచ

రోడ్డు పనులు పూర్తయిన వెంటనే బస్సులు పునరుద్ధరిస్తాం

వంగపల్లి నుంచి మోటకొండూరు వరకు బీటీ రోడ్డు పూర్తిగా గుంతల మయమైంది. దీంతో ఆర్టీసీ బస్సులు తరచూ మొరాయిస్తున్నందున మోటకొండూరు రూట్‌లో బస్సులు నిలిపివేశాం.  రోడ్డు మరమ్మతు పనులను పూర్తి చేసిన వెంటనే బస్సు సర్వీసులను పునరుద్దరిస్తాం. 

-శ్రీనివాస్‌, ఆర్టీసీ డిపో మేనేజర్‌, యాదగిరిగుట్ట 


Updated Date - 2022-09-13T05:46:30+05:30 IST