ముక్త్యాల కాల్వకు నీటి సామర్థ్యం పెంచాలి
ABN , First Publish Date - 2022-09-24T06:17:47+05:30 IST
సాగర్ ఎడమకాల్వ పరిధిలోని మొదటి జోన్ కింద ఉన్న ముక్త్యాల బ్రాంచ్ కెనాల్కు నీటి సామర్థ్యం పెంచి 1000 క్యూసెక్కుల నీటిని వెంటనే విడుదల చేయాలని సాగర్ ఆయకట్టు పరిరక్షణ కమిటీ కన్వీనర్ మేకల నాగేశ్వరరావు, టీపీసీసీ అధికార ప్రతినిధి దొంగరి వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ కోరారు.
హుజూర్నగర్, సెప్టెంబరు 23: సాగర్ ఎడమకాల్వ పరిధిలోని మొదటి జోన్ కింద ఉన్న ముక్త్యాల బ్రాంచ్ కెనాల్కు నీటి సామర్థ్యం పెంచి 1000 క్యూసెక్కుల నీటిని వెంటనే విడుదల చేయాలని సాగర్ ఆయకట్టు పరిరక్షణ కమిటీ కన్వీనర్ మేకల నాగేశ్వరరావు, టీపీసీసీ అధికార ప్రతినిధి దొంగరి వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ కోరారు. శుక్రవారం పట్టణంలోని ముక్త్యాల బ్రాంచ్ కాల్వలో దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయకట్టు చివరి భూములకు నీరందించాలన్నారు. మట్టపల్లి, గుండ్లపల్లి, కందిబండ, చింత్రియాల మేజర్లకు నీరందడం లేదన్నారు. కనీసం తూములకు కూడా నీరు రావడం లేదన్నారు. ఎడమకాల్వకు నీటి ప్రవాహం పెంచి ఎంబీ కెనాల్కు 1000 నుంచి 1500 క్యూసెక్కులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగర్ ఎడమ కాల్వకు పడిన గండిని వెంటనే పూడ్చి రైతులకు సకాలంలో నీరందిస్తున్నందుకు ప్రభుత్వానికి ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, కేఎల్ఎన్ రావు చౌదరిలు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ముందుచూపుతో రైతులను ఆదుకుంటోందన్నారు. అనంతరం హుజూర్నగర్లోని ఎన్ఎస్పీ కార్యాలయంలో సాగర్ ఎడమ కాల్వ నిర్వహణ జేఈకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కాకి అజయ్, జక్కుల రమేష్, చందర్రావు నాయక్, షేక్ యాకూబ్, విజయ్, జక్కుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.