మంటల్లో దగ్ధమవుతున్న అడవి
ABN , First Publish Date - 2022-03-23T06:01:18+05:30 IST
నల్లమల ఫారెస్ట్లో చెలరేగిన మంటలు నల్లమల ఫారెస్ట్లో చెలరేగిన మంటలు
తిరుమలగిరి(సాగర్), మార్చి 22: నల్లగొండ జిల్లా నల్లమల ఫారెస్ట్ పరిధిలోని నాగార్జునసాగర్ బీట్ పరిధిలోని మూలతండా, చెంచోనితండాల సమీపంలో మంటలు చెలరేగాయి. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఫారె్స్టలోని గుట్టపైన మంటలు చెలరేగాయి. అవి క్రమేణా పెద్దివికావడంతో స్థానిక తండావాసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సిబ్బంది వచ్చే సరికి సుమారు వంద ఎకరాల్లో అడవికి మంటలు చెలరేగడంతో సమీపంలో ఉన్న తండావాసులు భయాందోళనకు గురయ్యారు. మంటలు ఆర్పేందుకు హాలియా ఫైర్ స్టేషన్కు అగ్నిమాపక యంత్రాల కోసం సమాచారం ఇచ్చినప్పటికీ గుట్టపైకి ఎక్కడానికి అనువుగా దారిలేకపోవడంతో అగ్నిమాపక యంత్రాలు చేరలేకపోయాయి. దీంతో స్థానిక ఫారెస్ట్ సిబ్బంది తమ వద్ద ఉన్న ఎయిర్ బ్లోయర్లతో అడవిలో వ్యాపించిన మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నం చేశారు. ఈక్రమంలో సుమారు మూడు గంటలు దాటిన తరువాత మంటలు అదుపులోకి వచ్చినట్లు ఫారెస్ట్ సిబ్బంది పేర్కొన్నారు. అయితే ఫారెస్ట్ గుట్టకు సమీపంలో గుర్తు తెలియని రైతులు తమ పొలాల్లోని చెత్తను కాల్చివేయడంతో అవి గాలి ద్వారా వ్యాపించి అటవీ ప్రాంతంలోకి వ్యాపించి మంటలు లేచినట్లు ఫారెస్ట్ సిబ్బంది తెలిపారు.