అతివేగం.. అధ్వాన రహదారి

ABN , First Publish Date - 2022-12-12T23:29:43+05:30 IST

అధ్వాన రహదారి, అతివేగం ఇద్దరిని బలితీసుకుంది. అనంతగిరి నుంచి కోదాడకు వెళ్లే మార్గం గుంతలమయంగా ఉండటం, చీకటిలో అతివేగంతో ఆదివారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది.

అతివేగం.. అధ్వాన రహదారి
ఈనెల 11న రాత్రి జరిగిన ప్రమాదానికి కారణమైన రహదారిపై గుంత

ఇద్దరిని మింగిన ప్రమాదం

అనంతగిరి, డిసెంబరు 12 : అధ్వాన రహదారి, అతివేగం ఇద్దరిని బలితీసుకుంది. అనంతగిరి నుంచి కోదాడకు వెళ్లే మార్గం గుంతలమయంగా ఉండటం, చీకటిలో అతివేగంతో ఆదివారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన భార్యాభర్తలు దువ్వ రమేష్‌, రేణుకల మృతితో వారి ఐదేళ్లలోపు చిన్నారులు ఇద్దరు అనాథలయ్యారు. ఈ రహదారిపై తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

అధ్వానంగా ప్రధాన రహదారి

మండలంలోని ప్రధాన రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. నియోజకవర్గ కేంద్రమైన ఈ రహదారి గుండా అనంతగిరి, నడిగూడెం మండలాలకు చెందిన ప్రజలు నిత్యం ప్రయాణిస్తుంటారు. రెండు మండలాల ప్రజలు ప్రయాణించే ఈ ప్రధాన రహదారి గుంతల మాయం కావడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 11వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ప్రమాదానికి రోడ్డుపైన గుంత కారణంగా తెలుస్తోంది. గుంతను తప్పించే క్రమంలో ఆటోను బస్‌ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు.

చిన్నారులకు దిక్కెవరు

బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. తల్లిదండ్రులకు ఏమైందో తెలియని పరిస్థితిలో చిన్నారులు ఉండటం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. మృతుల కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని స్థానికులు కోరారు.

Updated Date - 2022-12-12T23:29:46+05:30 IST