శివకేశవులకు విశేష పూజలు

ABN , First Publish Date - 2022-12-12T23:48:14+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం శివకేశవులకు విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.

 శివకేశవులకు విశేష పూజలు
స్వామివారి నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు నిర్వహిస్తున్న అర్చకులు

స్వామివారిని దర్శించుకున్న అఘోరా గజేంద్రగోస్వామి

హరితాకాటేజ్‌ నవీకరణకు భూమి పూజ

యాదగిరిగుట్ట, డిసెంబరు 12: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం శివకేశవులకు విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. కొండగుహలో కొలువైన స్వయంభూ పాంచనారసింహుడికి శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో, కొండపైన అనుబంధ శివాలయంలో కొలువుదీరిన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి, స్ఫటిక రామలింగేశ్వరుడికి నిత్య పూజలు, రుద్రహవన పూజలు శైవాగమ పద్ధతిలో నిత్యవిధి కైంకర్యాలు నిర్వహించారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా 36,23,704 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. యాదగిరిక్షేత్రా న్ని కాశీకి చెందిన అఘోరా గజేంద్రగోస్వామి తన శిష్యబృందంతో కలిసి సందర్శించారు. స్వామీజీ గర్భాలయంలోని స్వయంభువులను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆలయ పునర్నిర్మాణ తీరును పరిశీలించగా, దేవస్థాన అధికారులు వివరించారు. యాదగిరికొండపైన మొదటి ఘాట్‌రోడ్‌లోని హరితాకాటేజ్‌ భవనం నవీకరణ(రూపురేఖలు) మార్పు చేసే పనుల ఆరంభానికి సోమవారం టూరిజం, దేవస్థాన అధికారులు సంప్రదాయరీతిలో భూమి పూజల్లో పాల్గొన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ యాదగిక్షేత్రాన్ని సందర్శించిన సమయంలో పాతకట్టడాల్లో ఒకటైన హరితాకాటేజ్‌ భవనాన్ని ఆధ్యాత్మిక రూపుతో తీర్చిద్దేందుకు అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వైటీడీఏ అధికారులు హరితాకాటేజ్‌కు ఆధ్యాత్మిక సొబగులు అద్దేందుకు ముసాయిదా ప్లాన్లను రూపొందించి సీఎం కేసీఆర్‌కు నివేదించగా, ముసాయిదా ప్లాన్లను సీఎం ఆమోదించి విడుదల చేయడంతో సంప్రదాయ పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-12-12T23:48:18+05:30 IST