పరిహారం ఇచ్చేవరకూ పనులు సాగనివ్వం

ABN , First Publish Date - 2022-02-19T06:20:43+05:30 IST

పరిహారం, పునరావాసం కల్పించేంతవరకు పనులను సాగనిచ్చేది లేదని చర్లగూడెం రిజర్వాయర్‌ ముంపు బాధితులు స్పష్టం చేశారు.

పరిహారం ఇచ్చేవరకూ పనులు సాగనివ్వం
రిజర్వాయర్‌ మట్టి పనులు చేపట్టకుండా బైఠాయించిన ముంపు గ్రామాల మహిళలు

చర్లగూడెం రిజర్వాయర్‌ పనులను అడ్డుకున్న బాధితులు

మర్రిగూడ, ఫిబ్రవరి 18: పరిహారం, పునరావాసం కల్పించేంతవరకు పనులను సాగనిచ్చేది లేదని చర్లగూడెం రిజర్వాయర్‌ ముంపు బాధితులు స్పష్టం చేశారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌కు సంబంధించిన మట్టి తవ్వకాలను యంత్రాల సహాయంతో శుక్రవారం నిర్వహిస్తుండగా ముంపు బాధితులు అడ్డుకున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుండా అధికారులు బలవంతంగా పనులు చేస్తే, తమకు పరిహారం అందకుండా పోతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఇరిగేషన్‌ అధికారులు దేవేందర్‌రెడ్డి, లక్ష్మయ్య మాట్లాడుతూ, 30 రోజులు సమయం ఇస్తే 248 మంది బాధితులకు పూర్తిస్థాయి పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయినా బాధితులు వినకపోవడంతో మట్టి తవ్వకం పనులను అధికారులు నిలిపివేశారు. అనంతరం బాధితుల చర్చించగా, హామీలన్నీ నెరవేర్చాకే పనులు చేపట్టాలని తేల్చిచెప్పారు. దీంతో అధికారులు పనులు నిలిపివేసి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. కార్యక్రమంలో ముంపు బాధితులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-19T06:20:43+05:30 IST