కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయాలి
ABN , First Publish Date - 2022-08-11T05:41:26+05:30 IST
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయాలని, ప్రజాసంగ్రామ యాత్ర లక్ష్యం కూడా అదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ప్రజాసంగ్రామ యాత్ర ఎనిమిదో రోజైన బుధవారం రామన్నపేట మండలం ఎల్లంకి, సిరిపురం, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి, సుంకెనపల్లిలో కొనసాగింది.
కేసీఆర్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి
భూములు లాక్కుని పేదలను రోడ్డున పడేయడమే ఇండస్ట్రియల్ పార్క్ పాలసీనా?
బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్
చిట్యాల రూరల్: రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయాలని, ప్రజాసంగ్రామ యాత్ర లక్ష్యం కూడా అదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ప్రజాసంగ్రామ యాత్ర ఎనిమిదో రోజైన బుధవారం రామన్నపేట మండలం ఎల్లంకి, సిరిపురం, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి, సుంకెనపల్లిలో కొనసాగింది. ఈ సందర్భంగా స్థానికులు తమ గోడును సంజయ్ ఎదుట వెల్లబోసుకున్నారు. కాలుష్య కంపెనీలతో కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని సంజయ్ అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట తమ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని, న్యాయం చేయాలని పలువురు బాధితులు సంజయ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలోని ఫార్మా కంపెనీల కాలుష్యంవల్ల అనారోగ్యంబారిన పడుతున్నామని, తమను రక్షించాలని వినతిపత్రం అందజేశారు. గుండ్రాంపల్లి గ్రామాన్ని సమీపంలో ఉన్న చౌటుప్పల్ మండలంలో కలపాలని స్థానికులు వినతిపత్రం అందజేశారు. సుంకెనపల్లికి వెళుతుండగా కల్లుగీతకార్మికుడు కనబడటంతో ఆయనతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడే గీతకార్మికుడు పోసిన కల్లును సంజయ్ తాగారు. పత్తిచేలో కలుపు తీస్తున్న కూలీల వద్దకు వెళ్లి పేదరికం, ఇబ్బందులు, పింఛన్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలప్పుడే మీలాంటి నాయకులొస్తారని, ఓట్లు వేయమని కార్యకర్తలు వచ్చి రూ.500, రూ.1000 ఇచ్చి చేతులు దులుపుకుంటారని, పైన ఉన్నొళ్లు ఎంతిస్తారో మాకు తెలియదుగా అని వృద్ధురాలు బండి సంజయ్తో చెప్పింది. మీరు అధికారంలోకి వచ్చాక పేదోళ్లను పట్టించుకోవాలని కోరింది.
కష్టాలు తెలుసుకునేందుకు వచ్చాం
తాము ఓట్లకోసం రాలేదని, ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ప్రధాని మోదీ పంపిస్తే వచ్చామని సంజయ్ వివరించారు. కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని వాటి గురించి వివరించారు. అనంతరం సుంకెనపల్లికి వెళ్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సమస్యలు తెలుసుకున్నారు. బీజేపీ జెండాను ఆవిష్కరించగా, మహిళా నాయకురాళ్లు బండి సంజయ్కి మంగళహారతులతో స్వాగతం పలికారు. సుంకెనపల్లికి చెందిన దర్శకుడు, మాజీ జర్నలిస్టు దామోదర్రెడ్డి తల్లిదండ్రులను బండి సంజయ్ పరామర్శించారు. భోజనం చేసి వెళ్లాలని దామోదర్రెడ్డి తల్లి కోరగా మళ్లొచ్చినప్పుడు తప్పకుండా భోజనం చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగారు. అంతకుముందు దాసోజు శ్రవణ్కుమార్ సంజయ్కు మద్దతు తెలిపి, కొంతసేపు యాత్రలో నడిచారు.
పేదల భూములను లాక్కొంటున్నారు
ఇండస్ర్టియల్ పార్క్ పేరిట పేదల అసైన్డ్ భూములను లాక్కొని, వారి కుటుంబాలను రోడ్డున పడేయడమే ఇండస్ర్టియల్ పార్క్ పాలసీనా అని సంజయ్ ప్రశ్నించారు. వెంట నే ఇండస్ర్టియల్ పార్క్ ఏర్పాటును ఉపసంహరించుకోవాలన్నారు. ఇక్కడి ఫార్మాకంపెనీల కాలుష్యంతో ప్రజలు అల్లాడిపోతుంటే పట్టించుకోకుండా ఉండటం బాధాకరమని, ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే కంపెనీలు అవసరమా? అని ప్రశ్నించారు.
కల్లుగీత కార్మికులను ఆదుకోవడంలో విఫలం
కల్లుగీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవడంలో ఘో రంగా విఫలమైందని, లక్షలాది మంది గీతకార్మికులకు ప్రభుత్వపరంగా తగిన న్యాయం జరగడం లేదని సంజయ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే కల్లుగీత కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు అందరూ ఎదురు చూస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎ్సకు నూకలు చెల్లినట్టేనన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపుదామా! అన్న ఆసక్తితో అందరూ ఎదురు చూస్తున్నారన్నారు. అవినీతి, కుటుంబ పాలనకు చరమగీతం పాడటమే బీజేపీ ధ్యేయమని, అవినీతికి తాము వ్యతిరేకమని, కుటుంబ పాలనను అంతమెందించడమే ప్రజాసంగ్రామ యాత్ర ఉద్ధేశమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యకుడు కంకణాల శ్రీధర్రెడ్డి, గొంగిడి మనోహర్రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, గోలి మదుసూదన్రెడ్డి, సంగప్ప, గోలి ప్రభాకర్, అసెంబ్లీ ఇన్చార్జి వెంకన్న, మండల అధ్యక్షుడు పొట్లపల్లి నర్సింహ, ప్రఽధానకార్యదర్శి బొడిగె లక్ష్మయ్య, మైల నర్సింహ, బుస్సు నర్సింహ, సోమగోని నర్సింహ, అనుముల శ్రీనివాస్, పాపని వనజవాసుదేవ్ పాల్గొన్నారు.
రుణమాఫీ చేయకుండా మోసం చేస్తున్న కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తనపేరిట ప్రచారం చేసుకుంటున్నారని, ఉచిత బియ్యం కూడా కేంద్రమే ఇస్తుంద ని బండి సంజయ్ అన్నారు. రైతాంగానికి రుణమాఫీ చే స్తామని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశాడన్నారు. పం ట బీమా కల్పించకపోవడంతో అకాల వర్షాలకు రైతాం గం నష్టపోయిందన్నారు. నిరుద్యోగ సమస్య తీరుస్తామ ని, ఇంటికో ఉగ్యోగమంటూ ఆయన ఇంట్లోనే ఉద్యోగాల ను నింపుకున్నారని, నిరుద్యోగులను మోసగించారని, ఇదీ ఆయన నైజమన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను సీఎం కేసీఆర్ మోసగిస్తున్నారని, ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలకు మాయమాటలు చెబుతున్న ఆయనపై అందరూ కోపంగా ఉన్నారన్నారు.
ఎన్నికలొస్తేనే కేసీఆర్కు ప్రజలు గుర్తుకొస్తారు
రామన్నపేట: ఎన్నికలొస్తేనే సీఎం కేసీఆర్ కు ప్రజలు గుర్తుకొస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ అన్నారు. రామన్నపేట మండలం వెల్లంకి, సిరిపురం గ్రామాల్లో బండి ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్రతో గ్రామ గ్రామాన పాదయాత్ర నిర్వహిస్తున్నానని చెప్పారు. గత ఎన్నికల్లో ఓటుకు రూ.20వేల వరకు ఖర్చుచేసిన కేసీఆర్, రాబోయే మునుగోడు ఉప ఎన్నికలో ఓటుకు రూ.30వేల వరకు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించడంతో సీఎం కేసీఆర్ అహంకారం తగ్గి ఫామ్హౌస్ వదిలి ప్రగతిభవన్కు వస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎ్సను ఓడిస్తే కేసీఆర్ రాక్షస పాలన అంతమవుతుందన్నారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మూడు ఎకరాల భూమి, దళితబంధు, డబుల్ బెడ్రూమ్లు వచ్చాయా అన్ని స్థానికులను అడగ్గా ఏది ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్ నుంచి 12మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నప్పుడు రాజీనామాచేసి ఎన్నికలకు వెళ్లారా అని ప్రశ్నించారు. బీజేపీలో చేరిన ప్రతీ ఒక్క రూ ఆ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారని, అలా ఎన్నికలకు వెళ్లిన వారు మొనగాళ్లని సంజ య్ అన్నారు. వెల్లంకి గ్రామంలో డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గ్రంథాలయానికి వెళ్లి ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు, యాత్ర ప్రముఖ్ దాసరి మల్లేశం, గంగిడి మనోహర్రెడ్డి, బంగారు శృతి, నాయకులు ఆలె చంద్రశేఖర్, నకిరేకంటి మొగులయ్య, కన్నెకంటి వెంకటేశ్వరచారి, ఏలూరి శ్యామ్, శివకృష్ణ పాల్గొన్నారు.