ఈ నెల 10 వరకు ఆంక్షల పొడిగింపు
ABN , First Publish Date - 2022-01-03T06:36:15+05:30 IST
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నియంత్రణకోసం ప్రభుత్వం ఆదేశించిన ఆంక్షలను ఈనెల 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు రెమా రాజేశ్వరి, రాజేంద్రప్రసాద్ తెలిపారు.
సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేదం
మాస్కు ధరించకపోతే జరిమానా
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు రెమా రాజేశ్వరి, రాజేంద్రప్రసాద్
నల్లగొండ క్రైం, సూర్యాపేట క్రైం, జనవరి 2: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నియంత్రణకోసం ప్రభుత్వం ఆదేశించిన ఆంక్షలను ఈనెల 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు రెమా రాజేశ్వరి, రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆదివారం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నివారణకోసం ప్రభుత్వం జీవో.1 విడుదల చేయడంతోపాటు ఆంక్షలు విధించిందని, ఈనెల 10వ తేదీ వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, సభలు, సమావేశాలతోపాటు మతపరమైన, రాజీకీయ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేదం ఉందన్నారు. షాపింగ్ మాల్స్, ప్రజా రవాణా వ్యవస్థ, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కరోనా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి విధిగా భౌతిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసుకోవాలన్నారు. ప్రతీచోటా శానిటైజర్ అందుబాటులో ఉండాలని, థర్మల్ స్ర్కీనింగ్ చేస్తూ, కరోనా లక్షణాలు గుర్తించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకుంటే రూ.1000 జరిమానా మరింత కఠినంగా అమలు చేస్తామన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. ప్రజలంతా సహకరించి కరోనా నివారణకు తమవంతు బాధ్యత నెరవేర్చాలన్నారు.