సోనియాగాంధీపై ఈడీ విచారణ నిలిపివేయాలి
ABN , First Publish Date - 2022-07-28T06:16:47+05:30 IST
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఈడీ విచారణ నిలిపివేయాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి అన్నారు.
సూర్యాపేట టౌన్, జూలై 27: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఈడీ విచారణ నిలిపివేయాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఈడీ విచారణ పేరుతో వేధించడాన్ని నిరసిస్తూ సత్యాగ్రహదీక్ష చేపట్టి మాట్లాడారు. మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీలు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని, అలాంటి కుటుంబంపై ఈడీ పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని జీర్ణించుకోలేక కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులను నమోదు చేయించి వేధిస్తోందని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, ఆర్టీఏ చట్టం, ఉపాధిహామీ పథకం ప్రవేశ పెట్టారన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న బీజేపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, నాయకులు కొప్పుల వేణారెడ్డి, చకిలం రాజేశ్వర్రావు, తిరుమలప్రగఢ అనురాధ, అంజద్అలీ, కక్కిరేణి శ్రీనివాస్, తూముల సురేష్,వీరన్న నాయక్, గుడిపాటి శేషయ్య, చింతపల్ల రమేష్, శ్రీనివాస్, గోపాల్రెడ్డి, చెంచల శ్రీను, నరేందర్నాయుడు పాల్గొన్నారు.