జిల్లాలో ధనుర్మాస ఆధ్యాత్మిక శోభ
ABN , First Publish Date - 2022-12-30T00:32:03+05:30 IST
ధనుర్మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హోమాలు, తిరుప్పావై పారాయణాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు అయ్యప్పస్వాముల పడిపూజలు కొనసాగాయి.
ధనుర్మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హోమాలు, తిరుప్పావై పారాయణాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు అయ్యప్పస్వాముల పడిపూజలు కొనసాగాయి.
సూర్యాపేట కల్చరల్, డిసెంబరు 29 : ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం అర్చకులు సుదర్శన హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధానఅర్చకుడు నల్లాన చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి విశేషపూజలు నిర్వహించారు. 45 రోజులుగా దీక్షలు స్వీకరించిన గోవింద మాల భక్తులు ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి బయలుదేరడానికి ముడుపులు కట్టారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహాకులు గుండా శ్రీనివాస్, దంతాల నాగరాజు, బూర నాగరాజు, శేఖర్, గవ్వ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
నేడు సామూహిక లక్ష కుంకుమార్చన
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న ఉదయం 10 గంటలకు శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వేణుగోపాలాచార్యులు తెలిపారు. మహిళా భక్తులు అధికసంఖ్యలో హాజరుకావాలన్నారు.
మట్టపల్లిలో వైభవంగా నృసింహుడి కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యశాశ్వత కల్యాణాన్ని అర్చకులు వైభవంగా గురువారం నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారికి తిరుప్పావై పాశుర పఠనం జరిగింది. మాంగళ్యధారణ, తలంబ్రాలు ఘట్టాలతో నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మకర్తలు చెన్నూరి విజయ్కుమార్, మట్టపల్లిరావు పాల్గొన్నారు.
ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ
నూతనకల్:మండలంలోని ఎర్రపహాడ్ గ్రామంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన అయ్యప్పస్వామి లింగాల లోకేష్ స్వగృహంలో నిర్వహించిన మహాపడిపూజ కార్యక్రమంలో అయ్యప్పస్వామికి అభిషేకాలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ గుర్రం సత్యనారాయణ, గురుస్వాములు లింగాల రామచంద్రయ్య, లింగాల వెంకన్న, లింగాల మల్లేష్, అనంతుల వెంకన్న, జల్గం గౌతం, శీలం మదు, అనంతుల ఆంజనేయులు, దేవరకొండ మహేష్, సత్తయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కోదాడలో పదహారు రోజుల వేడుక
కోదాడటౌన: కోదాడ పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో ముత్యాలమ్మ పోతురాజుల విగ్రహప్రతిష్ట అనంతరం పదహారు రోజుల వేడుకను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితారాధారెడ్డి ముత్యాలమ్మ అమ్మవారికి చీరె, సారెలో భోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సుంకర పుల్లయ్య, సుంకర అభిదర్నాయుడు, కేవీ రత్నం తదితరులు పాల్గొన్నారు.