కలెక్టర్‌ పమేలాసత్పథికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-28T06:08:57+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పథికి కరోనా పాజిటివ్‌గా గురువారం నిర్ధారణ అయ్యింది.

కలెక్టర్‌ పమేలాసత్పథికి కరోనా పాజిటివ్‌

యాదాద్రి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : యాదాద్రి భువనగిరి జిల్లా  కలెక్టర్‌ పమేలా సత్పథికి కరోనా పాజిటివ్‌గా గురువారం నిర్ధారణ అయ్యింది. ఆమె హోం ఐసోలేషనలో ఉన్నారు. ఈ నెల 26వ తేదీన కలెక్టరేట్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో ఆమె పాల్గొని పతాకావిష్కరణ చేశారు. అనంతరం సీఎం దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో దళితబంధు పథకం అమలుపై నిర్వహించిన సమీక్షలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జ, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.శరత, స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి దివ్య దేవరాజనతో పాటు స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాల్గొన్నారు. దళితబంధు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేశారు. సుమారు ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గురువారం ఆమె అనారోగ్యానికి గురికావడంతో క్యాంప్‌ కార్యాలయంలోనే విధులు నిర్వర్తించారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగా; పాజిటివ్‌గా తెలిసింది. దీంతో కలెక్టర్‌తో పాటు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఇతర అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కలెక్టరేట్‌ ఏవో పాజిటివ్‌తో హోంక్వారంటైనలో ఉన్న మరో ఏడుగురు సిబ్బంది కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్నారు. వీరితో పాటు కలెక్టర్‌కు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కార్యాలయాలన్ని శానిటైజ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2022-01-28T06:08:57+05:30 IST