సీఎం ప్రకటనతో ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంబరాలు

ABN , First Publish Date - 2022-03-16T05:34:58+05:30 IST

ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో ఫీల్డ్‌ అసిస్టెంట్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. వేతనాలు పెంచాల ని ఆందోళనలు చేసిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను ప్రభుత్వం 2020, మా ర్చి నెలలో విధుల్లోంచి తొలగించింది.

సీఎం ప్రకటనతో ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంబరాలు
నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షారాభిషేకం చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు

మోత్కూరు, మార్చి 15: ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో ఫీల్డ్‌ అసిస్టెంట్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. వేతనాలు పెంచాల ని ఆందోళనలు చేసిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను ప్రభుత్వం 2020, మా ర్చి నెలలో విధుల్లోంచి తొలగించింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1165మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లకు టీఏ,డీఏలు కలిపి నెలకు రూ.10వేల వరకు వేతనం వచ్చేది. కాగా, ప్రభుత్వం వారిని విధుల నుంచి తొలగించడంతో కుటుంబాలను పోషించుకునేందుకు ఇబ్బందులుపడ్డారు. ఎంతో కాలంగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్న తమను తొలగించ డం సమంజసం కాదని వారు రెండేళ్లుగా ఆందోళనలు చేసినా ప్రభుత్వం కనికరించలేదు. కాగా, ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రకటించారు. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కాగా, ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోంచి తొలగించడంతో ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో నిర్వహించాల్సిన ఉపాధి హామీ పథకం పనులను గుర్తించి, కూలీలకు పని కల్పించడం, మండలం నుంచి మస్టర్లు తీసుకెళ్లడం, హాజరు పరిశీలించడం, గ్రామ సభల నిర్వహణ తదితర పనులను పంచాయతీ కార్యదర్శులే నిర్వహించారు. ఇది లా ఉండగా, యాదాద్రి జిల్లాలో 401, నల్లగొండలో 837,సూర్యాపేటలో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ పంచాయతీ కి ఒక ఫీల్డ్‌ అసిస్టెంటు ఉండాలి. కాగా, కొన్ని చోట్ల ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం తొలగించే నాటికి ఉమ్మడి జిల్లాలో 1165 మంది విధుల్లో ఉన్నారు.



సంతోషంగా ఉంది : కమ్మంపాటి వీరస్వామి, పొడిచేడు ఫీల్డ్‌ అసిస్టెంట్‌

తమను సీఎం కేసీఆర్‌ తిరిగి విధుల్లోకి తీసుకోవడం సంతోషంగా ఉంది. విధుల నుంచి తొలగించిన నాటి నుంచి కుటుంబాలను పోషించుకునేందుకు ఇబ్బందిపడ్డాం. ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తుల మేరకు కేసీఆర్‌ స్పందించి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో 1165 ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఉపాధి కల్పించిన వారయ్యారు.


Updated Date - 2022-03-16T05:34:58+05:30 IST