నుపుర్శర్మను అరెస్టు చేయాలి: ఎంపీ అసదుద్దీన్
ABN , First Publish Date - 2022-06-07T09:08:50+05:30 IST
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మను తక్షణమే అరెస్టు చేయాలని ఎంపీ అసదుద్దీన్
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మను తక్షణమే అరెస్టు చేయాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. నుపుర్ విద్వేష వ్యాఖ్యల వల్ల ప్రపంచ దేశాల ముందు భారత్ ముఖం చెల్లని విధంగా అయిందన్నారు. ఈ ఘటనతో భారత విదేశాంగ విధానం విధ్వంసానికి గురైందని ఆందోళన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాల్లో భారత పౌరులపై ఏదైనా విద్వేష ఘటన జరిగితే విదేశాంగ మంత్రి జై శకంర్ ఏం చేస్తారని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే విద్వేష వ్యా ఖ్యలు చేసేవారిని టీవీ చర్చలకు పంపుతోందని ఆరోపించారు.
అంతర్జాతీయం గా వ్యతిరేకత వచ్చినప్పుడు సదరు నేతలపై ఏదో చిన్న చర్య తీసుకుని, చేతులు దులుపుకుంటోందని ఆగ్రహించారు. నుపుర్ శర్మను బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తే సరిపోదని అసద్ అభిప్రాయపడ్డారు. బీజేపీ నేతల విద్వేష వ్యాఖ్యల వల్ల ఖతర్లో పర్యటించిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు గౌరవార్థం ఏర్పాటు చేసే విందు కార్యక్రమాన్ని నిర్వహించలేదని గుర్తు చేశారు. ఇది దేశానికి ఎంత ఇబ్బందికర పరిస్థితి అని అసద్ నిలదీశారు.