రైతుదీక్షను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-07-05T05:33:56+05:30 IST
రైతుదీక్షను విజయవంతం చేయాలి
ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క
ములుగు కలెక్టరేట్, జూలై 4: హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ఈనెల 6న రాష్ట్ర కిసాన్సెల్ ఆధ్వ ర్యంలో జరిగే రైతు దీక్షను విజయవంతం చేయాలని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైందని, పంట పెట్టుబడికి అవసరమైన రుణాలు ఇచ్చే నాథుడే లేడని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.లక్ష వరకు రుణమాఫీని ఏకకాలంలో చేయాలని, పోడు భూములకు హక్కుపత్రాలు అందించాలని, పంటలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుదీక్షకు నియోజకవర్గంలోని రైతులు, రైతుసంఘాల నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు.
దొడ్డి కొమురయ్యకు నివాళులు
నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు దొడ్డి కొమురయ్య అని ఎమ్మెల్యే సీతక్క కొనియాడారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆమె ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేయడానికి కొమురయ్య ప్రజా ఉద్యమాలు నడిపించారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, నాయకులు మల్లాడి రాంరెడ్డి, బానోత్ రవిచందర్, బైరెడ్డి భగవాన్రెడ్డి, ఎమ్డీ.చాంద్పాషా, చెన్నోజు సూర్యనా రాయణ, బండి శ్రీనివాస్, మావూరపు తిరుపతిరెడ్డి, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.