కేసీఆర్ నాయకత్వంలో గొప్ప లౌకిక రాష్ట్రంగా తెలంగాణ వర్థిల్లుతున్నది

ABN , First Publish Date - 2022-04-25T00:03:30+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం గొప్ప లౌకిక రాజ్యంగా వర్థిల్లుతున్నదని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలు చెప్పారు.

కేసీఆర్ నాయకత్వంలో గొప్ప లౌకిక రాష్ట్రంగా తెలంగాణ వర్థిల్లుతున్నది

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం గొప్ప లౌకిక రాజ్యంగా వర్థిల్లుతున్నదని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలు చెప్పారు. అన్నికులాలు, మతాల విశ్వాసాలను కాపాడే విధంగా,ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా సుపరిపాలన కొనసాగుతున్నదన్నారు.అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తినిచ్చే విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు,కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని వివరించారు.బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగలను ప్రభుత్వం రాష్ట్ర అంతటా అధికారికంగా ఘనంగా జరుపుతుండడాన్ని మంత్రులు గుర్తు చేశారు.పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 29వ తేదీన ఎల్.బి.స్టేడియంలో  ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సంబంధిత శాఖల అధికారులతో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.


ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ఇచ్చే  ఇఫ్తార్ విందుకు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ప్రజా ప్రతినిధులు,మత పెద్దలు, ప్రముఖులు హాజరవుతారన్నారు.అతిథులకు ఆహ్వాన పత్రికలు సకాలంలో అందేలా చూడాలని, క్రమశిక్షణతో స్వాగతం పలికి,మర్యాదగా వ్యవహరించాలని అధికారులకు పలు సూచనలు చేశారు.ఎటువంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలని, ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు,చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను మంత్రులు ఆదేశించారు.వేదికను అందంగా అలంకరించాలని,ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తో తనిఖీ చేయించాలని, ఏ మాత్రం కొరత రానివ్వకుండా అందరికీ అందేలా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించిన మ్యాపును మంత్రులు పరిశీలించి, స్టేడియం అంతటా కలియ తిరిగి పర్యవేక్షించారు.


కాగా విద్యుత్తు, తాగునీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం రానివ్వొద్దని ప్రభుత్వ సలహాదారు అధికారులకు పలు సూచనలు చేశారు.స్టేడియం,దాని పరిసరాలను ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్తు దీపాలతో అలంకరించుకోవాలని,జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.అవసరమైన చోట్ల రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని,ముఖ్య కూడళ్లలో స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, వాహనాల రాకపోకలు సజావుగా సాగే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఖాన్ కోరారు.

Updated Date - 2022-04-25T00:03:30+05:30 IST