రూ.2 కోట్లు ఇచ్చినందుకు సిగ్గుపడండి
ABN , First Publish Date - 2022-02-16T08:34:13+05:30 IST
మేడారం జాతరకు రూ.2 కోట్లు మాత్రమే ఇచ్చినందుకు బీజేపీ నేతలు సిగ్గుపడాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
బీజేపీ నేతలను ఉద్దేశించి మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మేడారం జాతరకు రూ.2 కోట్లు మాత్రమే ఇచ్చినందుకు బీజేపీ నేతలు సిగ్గుపడాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకోవడం విచారకరమని ఎద్దేవా చేశారు. గిరిజనులకు రావాల్సిన హక్కులకు అడ్డు పడుతున్న బీజేపీ నేతలను వారే తరిమి కొడతారని ఆమె హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ భవన్లో సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి ఉత్సవాల్లో మాట్లాడుతూ గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. అన్ని వసతులు కల్పించినా గిరిజన విశ్వవిద్యాలయం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు.