వృద్ధులకు తప్పని ‘ఆధార్’ ఇబ్బందులు
ABN , First Publish Date - 2022-06-07T05:45:17+05:30 IST
ఆధార్లో వయస్సు తక్కువగా నమోదుకావడంతో మార్చుకోవడానికి వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు
వయస్సు మార్పునకు కొర్రీలు
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయలేక
అవస్థలు పడుతున్న వృద్ధులు, దివ్యాంగులు
తూప్రాన్, జూన్ 6: ఆధార్లో వయస్సు తక్కువగా నమోదుకావడంతో మార్చుకోవడానికి వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. ఆధార్లో వయస్సు మార్పు కాక, పింఛన్ అందక వారి బాధలు వర్ణనాతీతం. ఆధార్లో మార్పు చేసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఆధార్కార్డులో వివరాలు నమోదు చేసే సమయంలో కంప్యూటర్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా వయస్సును నమోదు చేశారు. వృద్ధుల వయస్సును యువకుల వయస్సులా నమోదు చేశారు. అయితే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వయస్సు తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక దరఖాస్తు చేసుకోవడానికి వీలుపడడం లేదు. ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రధానంగా స్టడీ సర్టిఫికేట్ అడుగుతున్నారు. పల్లెటూరుకు చెందిన పేదలు కావడంతో చదువుకోకపోవడంతో స్టడీ సర్టిఫికేట్ లేక మార్పులు చేసుకోలేకపోతున్నారు. పాన్కార్డు ఆధారంగా కూడా ఆధార్కార్డులో మార్పులు చేస్తున్నారు. అయితే ఆధార్కార్డు ఆధారంగానే పాన్కార్డు పొందుతున్నందున మార్పులు చేసేందుకు వీలుపడడం లేదు. ప్రభుత్వం త్వరలోనే 57 ఏళ్లకు వృద్ధాప్య పించన్ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో వృద్ధులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు తప్పడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి వృద్ధులను పరిశీలించి ఆధార్లో మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం కల్పించాలని, అందుకు అవసరమైన ధ్రువపత్రాలను జారీ చేయాలని వారు కోరుతున్నారు.