ఆలయాల్లో పూజలు
ABN , First Publish Date - 2022-11-24T00:00:20+05:30 IST
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం మండలంలోని కేతకీ సంగమేశ్వర ఆలయం భక్తులతో సందడిగా మారింది.
నారాయణఖేడ్/ఝరాసంగం/కల్హేర్, నవంబరు 23: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం మండలంలోని కేతకీ సంగమేశ్వర ఆలయం భక్తులతో సందడిగా మారింది. బుధవారం అమావాస్యను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి, హుమ్నాబాద్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్ కుటుంబ సభ్యులతో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హన్మంత్రావు పాటిల్, ఆలయ అధికారులు శివకుమార్ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. కల్హేర్ మండల పరిధిలోని బల్కంచెల్క(భక్తిధాం) తండాలో ధర్మకర్త మూడ్ కిషన్సింగ్, సర్పంచ్ మూడ్ లలిత ఆధ్వర్యంలో నిర్వహించిన జ్వాలాముఖి భవానీమాతా, సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయాల వార్షికోత్సవాలు మూడురోజుల పాటు కొనసాగాయి. ఆఖరి రోజైన బుధవారం శివపార్వతుల కళ్యాణం, సహస్ర సామూహిక కుంకుమార్చన, కుంభాభిషక ఊరేగింపు, సహస్ర దీపార్చన కార్యక్రమాలను నిర్వహించారు. నారాయణఖేడ్ పట్టణంలోని కల్పన హనుమాన్ ఆలయ తృతీయ వార్షికోత్సవంతో పాటు అఖండ హరినామ సంకీర్తన, సప్తాహా కార్యక్రమాలు బుధవారం అట్టహాసంగా కొనసాగాయి. కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహరాజ్, అంతర్గాం పీఠాధిపతి కరణ్గజేంద్రభారతి మహరాజ్ మాట్లాడుతూ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందన్నారు.