పారిశుధ్య నిర్వహణలో తిమ్మాపూర్‌ భేష్‌!

ABN , First Publish Date - 2022-11-23T23:55:52+05:30 IST

పారిశుధ్య నిర్వహణలో తిమ్మాపూర్‌ వందశాతం విజయవంతం సాధించిందని స్వచ్ఛ భారత్‌మిషన్‌ డైరెక్టర్‌ సురేశ్‌బాబు, అధికారుల బృందం కితాబునిచ్చింది.

పారిశుధ్య నిర్వహణలో తిమ్మాపూర్‌ భేష్‌!

స్వచ్ఛ భారత్‌మిషన్‌ అధికారుల బృందం కితాబు

జగదేవ్‌పూర్‌, నవంబరు 23 : పారిశుధ్య నిర్వహణలో తిమ్మాపూర్‌ వందశాతం విజయవంతం సాధించిందని స్వచ్ఛ భారత్‌మిషన్‌ డైరెక్టర్‌ సురేశ్‌బాబు, అధికారుల బృందం కితాబునిచ్చింది. గ్రామ పంచాయతీలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, ఓడీఎఫ్‌ ప్లస్‌ శిక్షణ కార్యక్రమంలో భాగంగా 32 జిల్లాల స్వచ్ఛ భారత్‌ మిషన్‌అధికారుల బృందం బుధవారం జగదేవ్‌పూర్‌ మండలంలోని తిమ్మాపూర్‌ను సందర్శించారు. ఏడు బృందాలు గ్రామంలో 350 కుటుంబాల వివరాలను సేకరించారు. ఓడీఎఫ్‌ పని తీరుపై సర్వే చేసి ప్రణాళికను తయారు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలోనే ఉండి గ్రామస్థాయి పారిశుధ్య ప్రణాళికకు రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్వచ్ఛ భారత్‌ మిషన్‌ డైరెక్టర్‌ సురేష్‌బాబు పరిశీలించారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌కేంద్రం ట్రైనర్‌ లక్ష్మీకాంత్‌షిండే గ్రామ విలేజ్‌ మ్యాప్‌(గ్రామ ముఖచిత్రం)ను గీసీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్లాస్టిక్‌ వాడకం పూర్తిగా నిషేధించి జ్యూట్‌ బ్యాగులను వాడే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శి, పాలక వర్గానికి సూచించారు. తిమ్మాపూర్‌ గ్రామం పారిశుధ్య నిర్వహణలో భేష్‌గా ఉందని, ఈవిధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా గ్రామస్థాయి పారిశుధ్య ప్రణాళిక రూపకల్పనను ఇక్కడి నుంచే ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్లు సచ్చితానంద్‌, సతీష్‌, ఎంపీపీ బాలేశంగౌడ్‌, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌లక్ష్మీరమేష్‌, డీఎల్పీవో వేదవతి, ఐఈసీ శ్యామ్‌, సతీష్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ సత్యనారాయణ, చెన్నారెడ్డి, ఎంపీడీవో శ్రీనివా్‌సవర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T23:56:15+05:30 IST