ప్రతీ కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి
ABN , First Publish Date - 2022-10-12T04:54:02+05:30 IST
ప్రతీ కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత పోలీస్ అధికారులకు సూచించారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత
సిద్దిపేట క్రైం, అక్టోబరు 11: ప్రతీ కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత పోలీస్ అధికారులకు సూచించారు. కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఆమె గజ్వేల్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ను పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. పెండింగ్ ఉన్న సీసీని త్వరగా తీసుకోవాలని సూచించారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కేసుల్లో శిక్షల శాతం పెంచాలని పేర్కొన్నారు. గంజాయి, పేకాటపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి సమూలంగా నిర్మూలించాలని సూచించారు. రౌడీలు, కేడీలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. ప్రతీ కేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలన్నారు. సైబర్ నేరాల్లో త్వరగా పరిశోధన పూర్తి చేయాలని తెలిపారు. టార్గెట్ పెట్టుకొని పెండింగ్ ఉన్న కేసులను తగ్గించాలన్నారు. ఈ-పెట్టి కేసులను వెంటనే డిస్పోజల్ చేయాలని సూచించారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహించాలన్నారు. పెట్రోలింగ్ అధికారులు రాత్రి సమయాల్లో పాత నేరస్తులను, లాడ్జిలను తనిఖీ చేయాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. సీసీ కెమెరాలను ప్రతిరోజూ మానిటర్ చేయాలని, పని చేయని సీసీ కెమెరాలను వెంటనే మరమ్మతు చేయించాలని పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణ గురించి గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు, ప్రజాప్రతినిధులకు వీపీవోలు, పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, గజ్వేల్ ఏసీపీ రమేశ్, సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ ఫణిందర్, సీఐలు వీరాప్రసాద్, కమలాకర్, రాజశేఖర్రెడ్డి, సీసీఆర్బీ సీఐ సైదానాయక్, సీసీఎస్ సీఐ సంజయ్, గజ్వేల్ డివిజన్ ఎస్ఐలు, సీసీఆర్బీ, ఐటీకోర్ టీం సిబ్బంది పాల్గొన్నారు.