సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-10-12T04:30:40+05:30 IST
సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని, పలుమార్లు సర్వసభ్య సమావేశంలో మొరపెట్టుకున్నా నేటివరకు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మండల సభలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీపీ గంగాధరి సంధ్య
దౌల్తాబాద్, అక్టోబరు 11: సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని, పలుమార్లు సర్వసభ్య సమావేశంలో మొరపెట్టుకున్నా నేటివరకు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మండల సభలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంగాధరి సంధ్యారవీందర్ అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. చాలాఏళ్ల క్రితం శౌరిపూర్ గ్రామంలో రూ.18 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకు పాత పైపులైన్ పగిలిపోవడంతో ఇబ్బందిగా మారిందని, వెంటనే కొత్త పైపులైన్ నిర్మించి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. అలాగే మల్లేశంపల్లి, శౌరిపూర్ గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సభ్యులు మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఫారుక్హుస్సేన్ తమ గ్రామానికి దసరా, బతుకమ్మ పండుగలకు వీధిలైట్లు అందించడంతో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్, వైస్ ఎంపీపీ అల్లి శేఖర్రెడ్డి మాట్లాడుతూ విద్యుత్శాఖ ఏఈ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, ఫోన్ చేస్తే లిఫ్టు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్పర్సన్గా ఎన్నికైన ఇప్ప లక్ష్మిని, వైస్ చైర్మన్ వేమ శ్రీనివా్సను మండల సభలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో గఫూర్, జడ్పీటీసీ జ్యోతిశ్రీనివా్సగౌడ్, డిప్యూటీ తహసీల్దార్ జహీర్ తదితరులు పాల్గొన్నారు.