చలి 6.6 డిగ్రీలు
ABN , First Publish Date - 2022-12-09T23:59:58+05:30 IST
ఉమ్మడి జిల్లాలో చలి పంజా విసురుతున్నది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదువుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో అత్యల్పంగా 6.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు
సిద్దిపేట జిల్లా హబ్సీపూర్ 7.9 డిగ్రీలు
మెదక్ జిల్లా చిట్కుల్లో 8 డిగ్రీలు
ఉమ్మడి జిల్లాను వణికిస్తున్న చలి
మెదక్ అర్బన్, డిసెంబరు 9: ఉమ్మడి జిల్లాలో చలి పంజా విసురుతున్నది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదువుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో అత్యల్పంగా 6.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. చలికి తోడు ఈదురుగాలులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 5 గంటలకే ఇళ్లకు చేరుకుంటున్నారు. ఉదయం 9 గంటలయినా బయటకు రావడంలేదు. చలి నుంచి రక్షించుకునేందుకు స్వెటర్లు, మంకీ క్యాప్లు ధరించి బయటకు వస్తున్నారు. తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తున్నది.
పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నాలుగు రోజుల క్రితం కనిష్ఠ ఉష్ణోగ్రత 12.2 డిగ్రీలుగా నమోదు కాగా.. శుక్రవారం 6.6 డిగ్రీలకు పడిపోయింది. చీకటి పడగానే మంచు కురుస్తోంది. వాహనాలు సైతం మంచులో తడిసి ముద్దవుతున్నాయి. తెల్లవారుజామున పనులు చేసుకునేవారు చలిని తట్టుకోలేకపోతున్నారు. పేపర్బాయ్లు, మున్సిపల్ కార్మికులు, కూలీలు విధులు చలి, పొగమంచుతో పనులు చేసుకోవడానికి అవస్థలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చలి మంటులు కాచుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా..
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 6.6 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా... అన్నాసాగర్లో 8, ముక్తాపూర్లో 8.1, సిర్గాపూర్లో 8.3, కోహిర్లో 8.9, గుండ్లమచానుర్లో 9.1 డిగ్రీల సెల్సియ్సగా నమోదైంది.
మెదక్ జిల్లా చిట్కుల్లో 8, భుజరంపేటలో 8.3, కౌడిపల్లిలో 8.4, బోడాగట్లో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సిద్దిపేట జిల్లా హబ్సీపూర్లో 7.9, తుక్కాపూర్లో 9.3, చీకోడ్లో 9.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.